కేసీఆర్ పై టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మళ్లీ విమర్శలు గుప్పించారు. తన పుట్టిన రోజున నూతన సచివాలయాన్ని ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. నూతన సెక్రటేరియట్ కు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టిన కేసీఆర్.. అక్కడ దగ్గరలోనే నిర్మిస్తున్న ఆయన విగ్రహాన్ని మాత్రం పరిశీలించే పరిస్థితి లేదని మండిపడ్డారు.
‘మీ పుట్టిన రోజున నూతన సచివాలయాన్ని ప్రారంభించే అర్హత మీకు ఎవరు ఇచ్చారని..సచివాలయం మీ ఆస్తి కాదు.. మీ జేబు ఆస్తి అసలే కాదు.. అది ప్రజలందరి ఆస్తి. అటువంటి సచివాలయాన్ని బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు కాకుండా.. మీ పుట్టిన రోజున ఎలాం ప్రారంభిస్తారని.. దీనిపై రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది.’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ప్రభుత్వం పై ఆయన కుటుంబంపై రాష్ట్ర ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో ప్రజాసంగ్రామ యాత్రలో స్పష్టమైందని బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 విడతల్లో చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. పాదయాత్రను ప్రధాని మోడీ అభినందించడం తనకు ఎంతో సంతోషాన్ని కల్గించదన్నారు. ఇందంతా కార్యకర్తల కృషి వల్లే సాధ్యమైందని చెప్పారు. కేసీఆర్ పరిపాలనలో రాష్ట్ర ప్రజలు పూర్తి నిరాశ,నిస్పృహ, కష్టాల్లో ఉన్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో మహబూబ్ నగర్ లో నిర్వహిస్తున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారని, బీజేపీ ఏ నిర్ణయం తీసుకోబోతుందని ఆలోచిస్తున్నారని వ్యాఖ్యానించారు.
తమ కోసం రాష్ట్ర ప్రభుత్వం పై పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే అని ప్రజలందరూ అనుకుంటున్నారని, మార్పు జరగాలని కోరుకుంటున్నారని, బీజేపీకి అవకాశం కల్పించాలని భావిస్తున్నారని బండి సంజయ్ చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబ పాలన, అవినీతి పాలన, రాజకార్ల పాలన కొనసాగుతుండడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే బీజేపీ అధికారంలోకి వస్తేనే జరుగుతుందని, ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి ఏ విధంగా జరుగుతుందో ప్రజలందరూ గుర్తించాలని కోరారు. అన్ని వర్గాలను కేసీఆర్ అణిచివేస్తున్నారని ఆరోపించారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ గార్డెన్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ముందుగా బీజేపీ జెండా ఎగురవేశారు. ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలన చేశారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జ్ సునీల్ బన్సల్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు రాష్ట్ర కార్యవర్గం అంతా పాల్గొన్నారు.