పెరూ, ఈక్వెడార్ లను భారీ భూకంపం శనివారం వణికించింది. ఈ శక్తివంతమైన భూకంపంలో దాదాపు 12 మంది మృతి చెందగా.. ఒకరు గాయపడినట్లు సమాచారం. భవనాలు చాలా వరకు దెబ్బతిన్నాయని ఈక్వెడార్ ప్రెసిడెన్సీ తెలిపింది. ఈక్వెడార్ లోని మచలా, క్యూన్కా వంటి నగరాల్లో భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి.
నగరాల్లో శిథిలాల దిబ్బలు కనిపించాయి. భూమి కంపించగానే భయాందోళనకు గురైన ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. రెస్క్యూ అధికారులు సహాయం అందించడానికి అక్కడికి చేరుకున్నారు. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూమికి 66 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం వచ్చిందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.
అదే ఈ భూకంపం భూమికి 10 కిలోమీటర్ల లోతున వచ్చి ఉంటే.. దీని ప్రభావం అత్యంత ఎక్కువగా ఉండేది. దీని కేంద్రం పెరూ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈక్వెడార్ మునిసిపాలిటీ బాలావోలో ఉందని అధికారులు తెలిపారు. గ్వాయాక్విల్, క్విటో, మనాబీ, మాంటాతో సహా ఇతర నగరాల్లో కూడా ప్రకంపనలు బలంగా కనిపించాయని సోషల్ మీడియా నివేదికలు తెలిపాయి.
పెరూలో ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం, పెద్ద నష్టం లేదు. ఇక్కడ భూకంపం తీవ్రత తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. భవనాలకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని… ప్రశాంతంగా ఉండాలని, అధికారిక మార్గాల ద్వారా తెలియజేయాలని ప్రజలను కోరారు. ఇక పెరువియన్ సిస్మోలాజికల్ అధికారులు మొదట్లో 7.0 తీవ్రతను నివేదించారు, కానీ గంట తర్వాత తీవ్రతను 6.7 కి తగ్గించారు. మరో వైపు సునామీ ముప్పు లేదని ఈక్వెడార్ నౌకాదళం తెలిపింది.