ఆసియాలోనే అతి పెద్ద గిరిజన పండుగగా చెప్పుకునే మేడారం జాతరకు కావలిసిన ఏర్పాట్లను అధికారులు సర్వం సిద్దం చేశారు. మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు తొమ్మిది వేల మంది పోలీస్ సిబ్బందితో భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. 400 సీసీ కెమెరాలతో నిత్యం పహారా కాయనున్నట్లు ఆయన తెలిపారు. 50 చోట్ల పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్లతో పాటు జాతర ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద అధునాతన రీతిలో భద్రతా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
క్రౌడ్ కంట్రోల్ నియంత్రణకు 33 డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు. 33 చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 37 చోట్ల పార్కింగ్ హోల్డింగ్ పాయింట్లు, ప్రతి రెండు కిలోమీటర్లకు పోలీసు అవుట్ పోస్టుల ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ట్రాఫిక్ జామ్ కాకుండా నిత్యం సీసీ కెమెరాలతో పర్యవేక్షణ నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. రోడ్డు మార్గం ద్వారా మేడారం జాతరకు వెళ్లాలనుకునే భక్తులు ట్రాఫిక్ లో ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు.
అయితే.. తెలంగాణ కుంభమేళగా భావించే మేడారం జాతరకు కోట్లాదిమంది ప్రజలు తరలివస్తున్నట్టు అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే 13వ తేదీ నుండి మేడారం జాతరకు వెళ్లే భక్తులకు హెలికాప్టర్ సేవలను అందించనున్నట్టు పర్యాటక శాఖ అధికారులు ప్రకటించారు.