ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర ప్రముఖ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆర్పీఎన్ సింగ్.. కాంగ్రెస్ కు గుడ్బై చెప్పారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కాషాయ కండువా కప్పుకున్నారు. దీనికి ముందు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఆయన రాజీనామా లేఖను పంపారు. దేశానికి, ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని లేఖలో పేర్కొన్నారు.
కొత్త రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తున్నట్లు సింగ్ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. అయితే. ఆర్పీఎన్ సింగ్.. ఝార్ఖండ్ లో కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యులుగా ఉన్నారు. ఆ రాష్ట్రంలో జేఎంఎంతో కలిసి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయితే.. ఎన్నికల్లో తన సన్నిహితులకు టికెట్ నిరాకరించడమే.. సింగ్ పార్టీని వీడేందుకు కారణమని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే ఆయన యూపీ కుషీనగర్ నుంచి గతంలో ఎంపీగా సేవలందించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు.
అతనితో పాటు కాంగ్రెస్ పార్టీకి మరో ఎంపీ గుడ్ బై చెప్పారు. కార్యకర్తలను విస్మరించారని ఆరోపిస్తూ.. మాజీ ఎంపీ ఆనంద్ ప్రకాశ్ గౌతమ్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడికి పంపించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు మొత్తం 7 దశల్లో జరగనున్నాయి. ఫిబ్రవరి 10న తొలి విడత పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.
గౌతమ్.. రెండు సార్లు రాజ్యసభ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో సీనియర్ నేతలు పార్టీ వీడడంపై కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కాంగ్రెస్ చేస్తున్న పోరాటాన్ని కొనసాగించాలంటే ధైర్యం అవసరం అని.. పిరికివాళ్లు ఈ యుద్ధం చేయలేరని ప్రియాంక గాంధీ అన్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథే తెలిపారు.