ఓ వివాహిత పవిత్ర బంధాన్ని మరచి వివాహేతర సంబంధం పెట్టుకుంది. విచ్చల విడిగా ప్రియుడితో కలిసి తిరిగింది. ప్రియుడితో కలిసి పతిపైనే బాణం ఎక్కుపెట్టి విడాకులివ్వాలని ఒత్తిడి తెచ్చింది. పది రోజులు సమయమిచ్చి వినకపోతే చంపేస్తానని హెచ్చరించింది. భార్య బెదిరింపులతో పోలీస్ స్టేషన్ గడపతొక్కిన భర్త ఈ విధంగా వాపోయాడు.
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలో వడ్రంగి పనిచేస్తూ జీవిస్తున్నా. అదే ప్రాంతానికి చెందిన మహిళతో 16 ఏళ్ల కిందట పెళ్లయింది. మా ఇద్దరికీ ఇది రెండో వివాహం. మాకు ఇద్దరు పిల్లలు. మా ఇంటిని బంధువులు కూల్చివేయడంతో పోలీసు స్టేషన్కు వెళ్లాం. అక్కడ ఓ వ్యక్తి తాను విలేకరినని తనకున్న పరిచయాలతో మాకు న్యాయం జరిగేలా చూస్తానన్నాడు. ఆ విధంగా నా భార్యతో పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి పరిశీలిస్తే నేను ఇంట్లోలేని సమయంలో మా ఇంటికి వచ్చి ఆమెతో సాన్నిహిత్యంగా ఉంటున్నట్లు స్థానికులు చెప్పారు. అదేమని ఆమెను నిలదీస్తే అతనితోనే ఉంటానని తనకు విడాకులు ఇవ్వమంటూ బెదిరిస్తోంది. పిల్లల జీవితం పాడైపోతుందని పెద్దమనుషుల ద్వారా నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుంటే వినకపోగా.. అతను, ఆమె కలసి నాపై గంజాయి కేసుపెట్టి లోపల వేయిస్తామని హెచ్చరించారు. ఆమెను ఎంత బతిమిలాడినా వినడం లేదు. ఇటీవల ఆమె తన ప్రియుడితో కలసి వచ్చి నాపై దాడి చేశారు. 10 రోజుల్లోగా విడాకులు ఇవ్వకపోతే చంపేస్తామని మృతదేహం కనిపించకుండా చేస్తామంటూ బెదిరించి వెళ్లారు. వారి నుంచి నాకు ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించాలని సోమవారం స్పందనలో ఎస్పీని కోరాను.