వచ్చేవారం నుంచి హైదరాబాదీలను ఎండలు దండించనున్నాయి. విపరీతమైన వేడి గాలులు వీచే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి హైదరాబాద్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఉష్టోగ్రతలు 32 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ వేడి పగటికే పరిమితం అవుతుందని శుభవార్త కాస్త ఊరటనిచ్చింది. రాత్రుళ్లు, ఉదయం మాత్రం చలి ప్రభావం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఫిబ్రవరి చివరి వారం వరకు పరిస్థితులు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ అధికారి తరనిబాలాజీ తెలిపారు. నగరంలోని ఉప్పల్, కాప్రా, కుత్బుల్లాపూర్, శేర్లింగంపల్లి, ఖైరతాబాద్, షేక్పేట్, ఆసిఫ్ నగర్, బహదూర్పురాతో పాటు సైదాబాద్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే 2015లో, ఎల్ నినో ప్రభావంతో వేసవిలో హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. ఇది భారతదేశంలో వర్షపాతం, పంటల ఉత్పత్తిపై ప్రభావం చూపింది.అయితే ఈ ఏడాది కూడా ఇదే ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.