నకిలీ పూచీకత్తుల ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. కరీంనగర్ లో తీగ లాగితే.. కలకత్తాలో డొంక కదిలింది. బ్యాంకు పూచీకత్తు పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు బట్టబయలు చేశారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ చేపట్టిన బయో మైనింగ్ కాంట్రాక్టును హర్షిత ఇన్ ఫ్రా దక్కించుకుంది. దీని కోసం సెక్యూరిటీగా రెండున్నర కోట్ల రూపాయలకు బ్యాంకు పూచీకత్తు అవసరమైంది.
దీంతో హర్షిత ఇన్ ఫ్రా సంస్థకి చెందిన ప్రతినిధులు.. వరంగల్ కు చెందిన న్యాయవాది అయిన లోన్ ఏజెంట్ నాగరాజును సంప్రదించి సహకరించాలని కోరారు. అందుకు భారీగా కమీషన్ కూడా ఇచ్చారు. నగరంలో స్థిరపడిన రాజస్థాన్ కు చెందిన నరేష్ శర్మ ద్వారా కోల్ కతాలోని నిలోత్పల్ దాస్, సుబ్రజిత్ ఘోషాల్ ను నాగరాజు సంప్రదించాడు.
కోల్ కథా, పార్క్ స్ట్రీట్ ఇండస్ ఇండ్ బ్యాంకు పేరుతో రూ.3కోట్ల 25 లక్షల విలువైన 12 నకిలీ పూచీకత్తు పత్రాలు సేకరించాడు. అనంతరం ఆ పత్రాలను హర్షిత ఇన్ ఫ్రా ప్రతినిధులు కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ప్రైవేటు లిమిటెడ్, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు అందజేశారు. అయితే లావాదేవీలు అనుమానాస్పదంగా ఉండటంతో ఆ పత్రాలను ఇండస్ ఇండ్ బ్యాంకు ప్రధాన కార్యాలయానికి ఈ-మెయిల్ చేయగా.. అవి నకిలీవని తేలింది.
దీంతో మాసబ్ ట్యాంకులోని ఇండస్ ఇండ్ బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. 4 నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.45 కోట్ల విలువైన 60 నకిలీ పూచీకత్తు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.