మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్. త్వరలోనే మెట్రో ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. ఇదే జరిగితే మెట్రో ప్రయాణం మరింత భారంగా మారనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మెట్రో ఛార్జీలపై ఫేర్ ఫిక్సేషన్ కమిటీ అధ్యయనం చేస్తోంది. ఆ నివేదిక ఆధారంగా త్వరలోనే ఛార్జీల పెంపు ఉండనుందని ప్రచారం జరుగుతోంది. విద్యుత్, నిర్వహణ భారం, ఖర్చులు పెరగడంతో మెట్రో ఛార్జీలను 25 నుంచి 30 శాతం వరకు పెంచేందుకు హైదరాబాద్ మెట్రో కసరత్తు చేస్తోందని తెలుస్తోంది.
ప్రస్తుతం మెట్రో ప్రయాణ కనీస ఛార్జీ రూ.10 కాగా, గరిష్టంగా రూ.60గా ఉంది. ఇక తాజా పెంపు ప్రతిపాదనలో భాగంగా ఎంత పెంచుతారనేది త్వరలో తేలనుంది. మరోవైపు ఆర్థికంగా ప్రాజెక్ట్ పునర్నిర్మాణంపై ఎల్అండ్ టీ హైదరాబాద్ మెట్రో సంస్థ దృష్టి పెట్టింది. ఆదాయం పెంచుకోవడంతో పాటు ప్రాజెక్ట్ ను లాభదాయకంగా మార్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.
హైదరాబాద్ మెట్రో నిర్మాణ ఖర్చు మొత్తం దాదాపు రూ.13 వేల కోట్లను ఎల్ అండ్ టీ సంస్థనే భరించింది. బ్యాంకుల కన్సార్షియం నుంచి రుణం తీసుకుని ప్రాజెక్ట్ పూర్తి చేసింది. ఈ క్రమంలోనే కరోనా లాక్ డౌన్ తో హైదరాబాద్ మెట్రో నష్టాల్లోకి కూరుకుపోయింది. రుణాలకు వడ్డీ చెల్లించలేని పరిస్థితి ఏర్పడటంతో కమర్షియల్ లోన్లను ఎల్ అండ్ టీ గ్యారంటీ బాండ్లుగా మార్చి వడ్డీని 9 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించుకుని భరిస్తూ వచ్చింది.
మరోవైపు రూ.3 వేల కోట్ల సాఫ్ట్ లోన్ ఇచ్చి ఆదుకోవాలని కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై సర్కారు సానుకూల స్పందించిందనట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో నష్టాలను తగ్గించేందుకు ఛార్జీలను పెంచనున్నట్లు తెలుస్తోంది.