టెక్నాలజీ పెరిగే కొలదీ క్రైమ్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. టెక్నాలజీని ఉపయోగించి ఎంతో మంది అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఇప్పటికే యువతులకు ఆన్ లైన్ లో వల వేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు మరో కొత్త తరహా నేరానికి శ్రీకారం చుట్టారు సైబర్ క్రిమినల్స్. హైదరాబాద్లో ఓ వర్గం యువతులే లక్ష్యంగా కొత్త తరహా ఆగడాలు ఎక్కువయ్యాయి.
ఇన్స్ స్టాగ్రామ్ లో జముండా-అఫిషియల్ పేరుతో ఓ ముఠా పెట్రేగిపోతోంది. ముఖ్యంగా ఒక వర్గానికి చెందిన వారిని టార్గెట్ చేస్తూ వీడియోలు రికార్డ్ చేసి, వాటిని ఇన్స్ స్టాలో పోస్ట్ చేసి యువతులను టార్గెట్ చేస్తున్నారు. రోడ్ల పై ఎక్కడైనా యువకుడితో కనిపిస్తే చాలు వీడియోలు తీస్తూ ఇన్స్తా లో పోస్ట్ లు పెడుతూ సదరు మహిళపై అభ్యంతర రాతలు రాస్తూ ముఠా రాక్షసానందం పొందుతున్నారు. పైగా తమ కమ్యూనిటీని డామేజ్ చేస్తున్నారంటూ మహిళకు ట్యాగ్ లైన్ ఇస్తూ పోస్ట్ లు చేస్తున్నారు.
జముండా-అఫిషియల్ ఇన్ స్టాలో 12 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. రోజు రోజుకు జముండా-అఫిషియల్ పేజ్ ఆగడాలు మితిమీరి పోతున్నాయి. మొత్తం 900 మంది యువకులు వీడియోలు తీసే పనిలో ఉన్నారని అడ్మిన్ స్టేటస్ పెట్టాడు.
వీరి ఆగడాలు తట్టుకోలేక పోలీసులు పలువురు ఫిర్యాదు చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులు జముండా-అఫిషియల్ పేజ్ పై మూడు కేసులు నమోదు చేశారు. 506, 509, 354(డి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పేజ్ నిర్వాహకుల పూర్తి డేటా ఇవ్వాలని ఇన్ స్టాగ్రామ్ కు లేఖ రాశారు పోలీసులు.