రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులకు సన్మానం చేశారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని రామకృష్ణ మఠంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు. అయితే ఆదివారం జీహెచ్ఎంసీ పారిశుధ్య మహిళా కార్మికులను మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద నేతృత్వంలో స్వాములు, వాలంటీర్లు ఘనంగా సన్మానించారు.
పారిశుధ్య కార్మికులను దుర్గామాత స్వరూపాలుగా భావించి వారిని సాదరంగా ఆహ్వానించి సత్కరించారు. మహిళా కార్మికులకు చీర, ప్రసాదం, శారదామాత జీవిత గాథ పుస్తకాలను కానుకలుగా అందించారు. ఈ సందర్భంగా స్వామి బోధమయానంద మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికులు నగరాన్ని నిత్యం శుభ్రంగా ఉంచడం వల్లనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటున్నారన్నారు.
వారి సేవలు అమూల్యమైనవని కొనియాడారు.గతంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో కూడా పారిశుధ్య కార్మికులు ఎలాంటి భయానికి లోనుకాకుండా ప్రాణాలకు తెగ్గించి విధులు నిర్వహించడం అభినందనీయమని వారిని ప్రశంసించారు.
అనంతరం మహిళా కార్మికులకు మఠంలో దర్శనం చేయించారు. రామకృష్ణ మఠం తమ సేవలను గుర్తించి స్వాములు సత్కరించడంపై ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశామని తెలిపారు జీహెచ్ఎంసీ పారిశుధ్య మహిళా కార్మికులు.