కాంగ్రెస్ అధ్యక్షునిగా పోటీ చేసే అరుదైన అవకాశం తనకు లభించిందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఏఐసీసీ అధ్యక్ష అభ్యర్థి మల్లిఖార్జున ఖర్గే అన్నారు. తాను ఇప్పటికే పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నానని పేర్కొన్నారు.
సుదీర్ఘ కాలంపాటు కర్ణాటక రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు. 2009లో సోనియా గాంధీ సూచనల మేరకు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశానని చెప్పారు. కేంద్ర కార్మిక శాఖ, సామాజిక న్యాయశాఖ మంత్రిగా పనిచేశానన్నారు.
సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు ఏఐసీసీ అధ్యక్షులుగా ఉండడానికి నిరాకరించడంతో ఎన్నిక అనివార్యమైందన్నారు. అధ్యక్ష స్థానంలో గాంధీ కుటుంబం వ్యక్తులు లేకపోవడం బాధాకరమన్నారు.
అందరి సూచనల మేరకు అధ్యక్ష స్థానానికి అభ్యర్థిగా నిలిచానన్నారు.
ఏపీ నుంచి వచ్చిన వాళ్లు దేశానికి దిశా నిర్దేశనం చేశారన్నారు. బీజేపీ, ఆరెస్సెస్ భావజాలనికి వ్యతిరేకంగా పోరాడే బలాన్ని తనకివ్వాలని కోరుతున్నట్టు తెలిపారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ ను అమలు చేస్తానన్నారు. రాబోయే ఎన్నికల్లో 50 శాతం సీట్లను 50 ఏండ్లలోపు వారికే ఇస్తామన్నారు.
రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోయిందన్నారు. రజాకర్ల వ్యతిరేక ఉద్యమంలో తన తల్లి సోదరుడు, సోదరిలను కోల్పోయానన్నారు. కుల, మతాల వారీగా దేశాన్ని బీజేపీ విభజిస్తోందన్నారు.
దేశం కోసం బీజేపీ, ఆరెస్సెస్ నేతలు ఏమైనా బలిదానాలు చేశారా..? అని ఆయన ప్రశ్నించారు. ఇందిరా, రాజీవ్ వంటి వారు దేశం కోసం ప్రాణ త్యాగం చేశారని పేర్కొన్నారు.