మహిళా ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన డిప్యూటీ తహశీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డిపై వేటు పడింది. ఆనంద్ కుమార్ రెడ్డిని మేడ్చల్ జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఆనంద్ కుమార్ తో పాటు దుర్గారావు అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిద్దరిని జూబ్లీహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు డిప్యూటీ తహశీల్దార్ ఆనందర్ కుమార్ రెడ్డి ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లోకి.. డిప్యూటీ ఎమ్మార్వో చొరబడేందుకు ప్రయత్నించడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
తెలంగాణ ప్రభుత్వం ఉన్నత స్థానంలో పని చేస్తున్న ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్నారు. రెండు రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో స్మితా సబర్వాల్ ఇంటికి తన స్నేహితుడితో కలిసి కారులో వెళ్లాడు. తన స్నేహితుడిని కారులోనే కూర్చోబెట్టి ఇంటి కాలింగ్ బెల్ కొట్టాడు. అర్ధరాత్రి ఎవరు కాలింగ్ బెల్ కొట్టారని సంశయిస్తూనే స్మితా సబర్వాల్ ఇంటి తలుపు తెరిచారు. ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తి ఉండటంతో ఖంగుతున్న ఆమె.. మీరు ఎవరు ? ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు ? మిమ్మల్ని లోపలికి ఎవరు పంపించారు? అంటూ అతడ్ని ప్రశ్నించారు.
తాను డిప్యూటీ తహసీల్దార్ని అని తన ఉద్యోగం గురించి మాట్లాడేందుకు వచ్చానని అతడు చెప్పటంతో ఆమె మండిపడ్డారు. అతడి వ్యవహారశైలి అనుమానస్పదంగా ఉండటంతో గట్టిగా కేకలు వేశారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. వెంట వచ్చిన స్నేహితుడిని, కారును జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆనంద్ కుమార్ రెడ్డిని రిమాండ్ కు తరలించారు. కాగా ఉద్యోగం విషయం గురించి మాట్లాడాల్సి ఉంటే ఏ కార్యాలయానికి వెళ్లకుండా.. అర్థరాత్రి మహిళా ఐఏఎస్ ఇంటికి వెళ్లటంపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తనకు ఎదురైన అనుభవాన్ని ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. రాత్రి భయంకరమైన సంఘటన నాకు ఎదురైంది. ఓ వ్యక్తి మా ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో నన్ను నేను ఎలా కాపాడుకోవాలో ఆలోచించాను. మీరు ఏ ప్రమాదం లేదని భావించినా.. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ఎదురవుతుందో తెలీదు. కాబట్టి ధైర్యంగా ఉండాలి. ఇంటి తలుపులు, తాళాలను మరోసారి తనిఖీ చేయండి.. అత్యవసర పరిస్థితుల్లో 100కి డయల్ చేయండని ఆమె సూచించారు.