టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి రేపటి నుంచి పినపాక నియోజకవర్గంలో పాదయాత్ర చేయనున్నారు. అయితే ఆయన పినపాక లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ పై ధ్వజమెత్తారు. ఇక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇక్కడి ఎమ్మెల్యే కమిషన్లకు, కాంట్రాక్టులకు అలవాటు పడి అధికార పార్టీకి అమ్ముడుపోయాడని మండిపడ్డారు.
ఇక దాతలు ఇచ్చిన భూమిలో కార్యకర్తలు పైసా పైసా కూడకట్టి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టుకుంటే ఇక్కడి ఎమ్మెల్యే దాన్ని కూడా కబ్జా చేసాడని,ఎమ్మెల్యే వెంటనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పార్టీకి అప్పగించి విజ్ఞత చాటుకోవాలని చెప్పారు. లేకపోతే వచ్చే కొత్త సంవత్సరం లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. అప్పుడు తగిన మూల్యం చెల్లించాల్సివస్తుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలను రాజకీయంగా బొంద పెట్టాలని.. మళ్ళీ ఏ చట్ట సభ మెట్లు ఎక్కకుండా చెయ్యాలని కార్యకర్తలు నిర్ణయం తీసుకున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. మొన్న మొయినాబాద్ లో 4 ఎమ్మెల్యే లపై ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నమోదు అయిందన్నారు.
ఆ కేసుకు సంబంధించిన వివరాలు పంపాలని సిబిఐ చీఫ్ సెక్రటరీ ని అడిగిందని.. ఆ కేసుతో పాటు కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల వివరాలు కూడా జత చేసి పంపాలని కోరిందన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన మొయినాబాద్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పాటు డీజీపీకి, సీఎస్ కు లేఖలు రాసి ఫిర్యాదు కాపీలు అందించామన్నారు. అందువల్ల మొయినాబాద్ కేసులో 12 మందిని కూడా జత చెయ్యాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన వారే అని.. అందులో పినపాక ఎమ్మెల్యే కూడా ఉన్నారని..వీరంతా ప్రలోభాలకు ఆశపడి ఫిరాయింపులు అలవాటు చేసుకున్నారని విమర్శించారు ఆయన.ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం 12 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన వారి పేరు జత చెయ్యకపోతే హైకోర్ట్ ను ఆశ్రఇస్తామని ఆయన హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ఎమ్మెల్యేలు పొందిన లబ్ది పైన విచారణ జరిపి అన్నీ స్వాధీనం చేసుకుంటామని..ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నేరుగా లబ్ది జరిగినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు రేవంత్ రెడ్డి. ఒకరు మంత్రి, ఒకరు కార్పోరేషన్ చైర్మన్, ఇంకొకరు విప్, కాంట్రాక్టులు, రాజకీయ పదవులు, ఆర్థిక లబ్ది జరిగిందన్నారు. ఇవన్నీ వివరాలు ఫిర్యాదులో పేర్కొన్నామన్నారు రేవంత్.
ఈ ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి, హోమ్ మంత్రులకు లేఖలు రాస్తామని అన్నారు. బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లు టిఆర్ఎస్, సీఎం కుంటుంబం అవినీతి మీద పదే పదే ఆరోపణ లు చేస్తున్నారని..కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ చేయాలని బండి సంజయ్, కిషన్ రెడ్డి లు అధికారికంగా లేఖలు రాయాలన్నారు రేవంత్. లేకపోతే ఈ రాజకీయ కుంభకోణంలో బీజేపీ కి కూడా పాత్ర ఉందని తేటతెల్లం అవుతుందన్నారు.