-ముందస్తు ఎన్నికలు జరిగితే పాదయాత్రకు బదులుగా బస్ యాత్ర
-ప్రజా సంగ్రామ యాత్ర నిర్వాహకుల ప్లాన్ !!
-రాష్ట్రంలోని మిగలిన అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టి రావడమే లక్ష్యంగా బస్ యాత్ర
-5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగిసిన వెంటనే హైదరాబాద్ లో పాదయాత్ర..
-10 రోజుల్లో ముగించేలా రూట్ మ్యాప్..
-ఖరారు చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డి
-ఇప్పటికే అటు పాదయాత్ర.. ఇటు జిల్లాల సమీక్షలతో బిజీబిజీగా బండి
-ఒకవైపు ప్రజల్లోకి… ఇంకోవైపు పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా వ్యూహం
-మొన్న నిర్మల్…. నేడు మంచిర్యాల జిల్లా ముఖ్య నేతలతో ముగిసిన సమీక్ష
-ఈనెల 5న ఆదిలాబాద్, 6న నిజామాబాద్..
-7న ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లా నేతలతో సమీక్షించనున్న బండి సంజయ్..
ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం అందుకు అనుగుణంగా తమ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. పార్టీని పూర్తిగా
సన్నద్దంగా ఉంచేలా పార్టీ క్యాడర్ ను సంసిద్దం చేస్తోంది. అదే సమయంలో ముందుస్తు ఎన్నికలొస్తే.. ప్రజా సంగ్రామ యాత్ర పరిస్థితి ఏంటనే.. అంశంపైనా పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. ఒకవేళ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళితే… పాదయాత్రకు సమయం సరిపోయే అవకాశం లేనందున… పాదయాత్రకు బదులుగా బస్ యాత్ర చేపట్టే అంశంపై సీరియస్ గా కసరత్తు మొదలుపెట్టారు.
ఇక బండి సంజయ్ తమ తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ.. పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్ రెడీ చేయాలంటూ.. పాదయాత్ర జరగని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బీజేపీ కార్యకర్తలు, నాయకుల నుండి ప్రజా సంగ్రామ యాత్ర నిర్వాహకులపై తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. దీంతో ముందస్తు నేపథ్యంలో’ బస్ యాత్ర’ పేరుతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసేందుకు పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం…. కేసీఆర్ ముందస్తుకు వెళ్లే అవకాశాలున్నందున బండి సంజయ్ అతి త్వరలో బస్ యాత్ర కు సిద్ధమవుతున్నారు.
మరోవైపు 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగిసిన వెంటనే 3 లేదా 4 రోజుల విరామం ఇచ్చి 6వ విడత ప్రజా సంగ్రామ యాత్రకు బండి సంజయ్ సిద్ధమవుతున్నారు. ఈసారి హైదరాబాద్ జంట నగరాల పరిధిలో పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్ ఖరారు చేస్తున్నారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ తరహాలోనే జంట నగరాల పరిధిలో 10 రోజులపాటు పాదయాత్ర కొనసాగించేలా పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి రూట్ మ్యాప్ ను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.
5వ విడత పాదయాత్ర ముగింపు సభ రోజున అధికారికంగా.. 6వ విడత ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ను
వివరించేందుకు యాత్ర నిర్వాహకులు సిద్దమయ్యారు.
మరోవైపు పాదయాత్రతో నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటున్న బండి
సంజయ్ కుమార్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు.
పాదయాత్ర విరామ సమయంలో, ఉదయం పూట పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా పార్టీ నేతలతో సమేశమై జిల్లాలు, నియోజకవర్గవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, పోలింగ్ బూత్ కమిటీ ల ఏర్పాటు, పార్టీ బలోపేతానికి చేపడుతున్న కార్యక్రమాలు, తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
చేస్తున్నారు.
అందులో భాగంగా మూడ్రోజుల క్రితం నిర్మల్ జిల్లా ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించారు.5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగిసేలోగా ఉత్తర తెలంగాణ జిల్లాల ముఖ్య నేతలతో సమీక్షను పూర్తి చేయనున్నారు. ఆ తరువాత దక్షిణ తెలంగాణ జిల్లాల సమీక్షపై ఫోకస్ పెట్టనున్నారు. ఈనెల 5న ఆదిలాబాద్ జిల్లా నేతలతో… 6న నిజామాబాద్ 7న ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాల ముఖ్య నేతలతో వరుసగా సమీక్షలు నిర్వహించబోతున్నారు.