బీజేపీ నేత,మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కు ఓటేస్తే.. బీఆర్ఎస్ కు వేసినట్టే అని చెప్పారు. తెలంగాణలో ప్రజలు మోడీ వైపు,బీజేపీ వైపే చూస్తున్నారని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలంలో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్టేనని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు వాళ్ల వ్యాపారాల కోసం బీఆర్ఎస్ తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. నాయకత్వ లోపం వల్ల కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలహీనపడిందన్నారు. బీఆర్ఎస్,బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కాదని.. రేవంత్ రెడ్డి ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు.
కేసీఆర్ తెలంగాణలో విశ్వాసం కోల్పోయిండన్నారు. రిపబ్లిక్ డే వేడుకలు జరపకుండా కేసీఆర్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. మునుగోడులో మందబలంతో, డబ్బుతో అప్రజాస్వామికంగా గెలిచారని ఆరోపించారు. నైతిక విజయం తనదేనన్నారు. గవర్నర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి దుర్మార్గుడని.. చదువురాని దద్దమ్మ అని రాజగోపాల్ విమర్శించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఏవిధంగా ఉందో బీఆర్ఎస్ నాయకుల మాటలు చూస్తే అర్థమవుతోందన్నారు. టీఆర్ఎస్ ను మార్చుకున్న కేసీఆర్ కి చివరకు వీఆర్ఎస్సేనని ఎద్దేవా చేశారు.