తూర్పు భూమధ్య రేఖా ప్రాంతానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో శుక్రవారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది.. ఇది పశ్చిమ వాయవ్య దిశగా మూడు రోజులపాటు నెమ్మదిగా పయనిస్తుందని ఐఎండీ (భారత వాతావరణ విభాగం) తెలిపింది. ఈ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది.
ఈ నెల 29, 30న ఏపీలోని దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. బంగాళాఖాతంలో జనవరి మొదటి వారం తర్వాత అల్పపీడనాలు చాలా అరుదుగా ఏర్పడుతుంటాయి అంటున్నారు వాతావరణ నిపుణులు. అంతకుముందే ఈశాన్య రుతుపవనాలు నిష్క్రమిస్తాయి కనుక వర్షాలకు ఆస్కారం ఉండదని చెబుతున్నారు.
కానీ ప్రస్తుతం సముద్రంపై తేమ ఎక్కువగా ఉండడంతో ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ఏర్పడడానికి అవకాశం ఉంది అంటున్నారు.ఇదిలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా చలి ప్రభావం బాగా పెరిగింది. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి.
ఉష్ణోగ్రతల క్షీణించడంతో కొద్దిరోజులగా ఏజెన్సీ ఏరియాతో పాటు రాయలసీమలో రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమల్లో రానున్న రెండు రోజులు మరింత తక్కువగా నమోదవుతాయని అంచనా వేస్తున్నారు.