లఖీంపూర్ కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరైంది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ను సుప్రీం కోర్టు మంజూరు చేసింది. బెయిల్ సమయంలో ఆయన యూపీలో కానీ, ఢిల్లీలోగానీ ఉండకూడదని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
వారంలోగా ఆశీశ్ మిశ్రా యూపీని వదిలి వెళ్లిపోవాలని తెలిపింది. బెయిల్ పై బయటకు వెళ్లాక ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేయరాదని సూచించింది. అలా చేస్తే బెయిల్ ను రద్దు చేస్తామంటూ హెచ్చరించింది. ఈ మేరకు జస్టిస్ సూర్య కాంత్, జేకే మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది.
బెయిల్ పిటిషన్పై మార్చి 14న మరోసారి న్యాయస్థానం విచారణ చేపట్టనున్నట్టు ధర్మాసనం వెల్లడించింది. బెయిల్ పై ఉన్న సయయంలో ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ ఉన్నారన్న విషయాన్ని ఆశిష్ న్యాయస్థానానికి తెలియజేయాల్సి వుంటుందని పేర్కొంది.
ఆశీష్ మిశ్రాకు 8 వారాల పాటు బెయిల్ ఇస్తున్నట్టు కోర్టు తెలిపింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా 2021లో యూపీలోని లఖింపూర్లో రైతులు ధర్నా చేపట్టారు. ఆ సమయంలో రైతుల మీదకు ఆశిష మిశ్రా కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించారు. దీంతో ఆశీష్ మిశ్రాను పోలీసులు అరెస్టు చేశారు.