తన భూమిని కౌలుకి ఇస్తే.. వారు చేసుకోకుండా మరెవరో కబ్జా చేశారని ఆరోపిస్తూ.. ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన మేడ్చల్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మండలంలోని రాజ బొల్లారం గ్రామానికి చెందిన గంగారాం అనే వ్యక్తి కి 18 ఎకరాల 5 గుంటల భూమి ఉంది.
దానిని అదే గ్రామానికి చెందిన వారికి కౌలుకి ఇచ్చి యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం పుట్టగూడెం తండాకు వలస వెళ్లారు. కొద్ది కాలం తరువాత తిరిగి వచ్చిన గంగారాం కుటుంబ సభ్యులు రాజ బొల్లారం గ్రామానికి వెళ్లి చూసే సరికి భూమిని కౌలుకి ఇచ్చిన వారు కాకుండా వేరే వారు కబ్జాలో ఉన్నారు. ఇదేంటని అడిగితే తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని గంగారం కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
తమ భూమిలో కబ్జాలో ఉన్నవాళ్లు రికార్డులను తారుమారు చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి గంగారం కుటుంబ సభ్యులు వెళ్లారు.
అయితే.. తమను ఎవరూ పట్టించుకోలేదని ఆరోపిస్తూ.. గంగారాం తన వెంట తెచ్చుకున్న కిరోసిన్ ను తనపై పోసుకుని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. దీంతో అక్కడే పోలీసులు, స్థానికులు అడ్డుకున్నారు. వెంటనే గంగారంను శామీర్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.