పుట్టినవాడు మరణించక తప్పదు. మరణించిన వాడు జన్మించక తప్పదు.అనివార్యమగు ఈ విషయం గురించి చింతించవలదు అని భగవద్గీత చావుగురించి చాలా సింపుల్ గా చెప్పింది.భగవద్గీత గురించి కాసేపు పక్కన బెడితే, మనలో మనమాట. మరణం తర్వాత జీవితం ఉందా?
అసలు మరణం అంటే ఏమిటి? మరణం బాధాకరమైనదా? పునర్జన్మ ఎలా సంభవిస్తుంది? మరణం తర్వాత ముఖ్యంగా మనం ప్రేమించినవారో లేక మనతో ఉండే వారికో మరణం సంభవించినప్పుడు, ఇలాంటి ప్రశ్నలు మన మైండ్ మెలిపెడుతుంటాయి.
మనందరిలో ఉండే అతి కామన్ భయం చావు. ఈ చావు మనిషి జీవితంలో అత్యంత భయంకరమైనదని అంటారు.ఎంత భయపడినా మనం ఎవరం తప్పించుకోలేని వాస్తవం. కాని అది కొందరికి సుఖం. ఒక ఆస్తికుడికి దేవుడిని చేరతాననే తపన, ఓ నాస్తికుడికి తన శరీరం భూమిలో కలిసిపోతుంది, అంతకు మించి ఏమి జరగదనే వాదన.
ఇలా మాట్లాడుకుంటూ పోతే వివిధ వ్యక్తుల దృష్టిలో మరణానికి వివిధ తాత్పర్యాలు కనిపిస్తాయి. అలాగే వివిధ మతాల్లో కూడా మరణం మీద వివిధ రకాల అర్థాలు, అంతరార్థాలు, గమ్యాలు కనిపిస్తాయి.
మన శరీరం లేదా ఆత్మ మరణం తరువాత ఎటు వెళుతుంది? అసలు ఆత్మ అనేది ఉందా? ఆత్మ నిజమైతే, ఆత్మకి స్పర్శ లేకపోవటం కూడా నిజమే కదా? మరి ఆత్మని నరకంలో ఎలా వేధిస్తారు? ఆత్మ స్వర్గంలో ఎలా ట్రీట్ చేస్తారు.
అసలు ఆత్మకి నొప్పి తెలుస్తుందా ? పుణ్యకార్యాలు చేసిన మనుషుల సంగతి ఏమిటి? వారు యముడి దగ్గరకి వెళ్ళరా? హిందూ మతం కాకుండా, వేరే మతాల్లో కూడా ఈ స్వర్గం నరకం కాన్సెప్ట్ ఉందా? ఒక వేళ ఉంటే మరణం గురించి మతాలు ఏమంటున్నాయ్?! జస్ట్ తెలుసుకుందాం.
ముందుగా, హిందూ మతం గురించి మాట్లాడుకుంటే, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చావు గురించి చాలా చెప్పాడు. దాని ప్రకారం మరణం అంటే ఆత్మ ఒక శరీరాన్ని వీడి మరో శరీరాన్ని ధరించటం.
శరీరం అనేది ఆత్మకి ఒక వస్త్రం లాంటిది. ఎలాగైతే దేహం ఒక వస్త్రాన్ని విడిచిన తరువాత మరో వస్త్రాన్ని ధరిస్తుందో, అలాగే ఆత్మ కూడా ఒక శరీరాన్ని విడిచి మరో శరీరాన్ని ధరిస్తుంది. అదే పునర్జన్మ అంటే.
ఓస్, అంతేనా అని అనుకోకండి. చనిపోయిన తరువాత ఆత్మ గమనం గురించి గరుడ పురాణం లో వివరంగా చెప్పబడింది. దాని ప్రకారం చూస్తే ఆత్మ శరీరాన్ని వీడగానే ప్రాణం పోతుంది. మరి ఆ ఆత్మ పయనం ఎటు? యమలోకం వైపే. పుణ్యాత్ములైనా, పాపాత్ములైనా, మహాభక్తులైనా, మొదట వెళ్ళాల్సింది యమలోకానికేనట.
ఇదేమి ట్విస్ట్ అని అనుకుంటున్నారా? పాపాలు ఎక్కువ చేసిన వారైతే, వారి ఆత్మ భూమి మీద శరీరాన్ని వీడి మరో శరీరాన్ని వెంటనే ధరిస్తుంది. దీన్నే యాతన శరీరం అని అంటారు.
ఈ నరక యాతన శరీరం నొప్పులని అనుభవించటానికే ఉంటుందట. ఈ శరీరం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, మనకు సాధారణం అనిపించే నొప్పి, ఈ శరీరానికి మాత్రం అసాధారణం.
అంతేకాదు, ఎంతటి నొప్పి వేసినా, ఈ శరీరానికి చావు ఉండదు. అంటే, నూనెలో కాల్చినా, మంటలో పడేవేసినా, నొప్పి తెలుస్తుంది తప్ప చావు రాదు అన్నమాట.ఈ యాతన శరీరానికి కూడా ఆకలి దప్పిక వేస్తుందట. అందుకే చనిపోయిన వారికి పిండప్రదానం చేయాలని అంటారు.
యాతన శరీరం, భూలోకంలో దగ్గరివారు పెట్టే పిండం మీదే ఆధారపడి ఉంటుందట.ఇక ఈ శరీరం 13 రోజులపాటు ఇక్కడిక్కడే ఉండగా, యమభటులు వచ్చి దాన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న యమలోకానికి తీసుకువెళతారు.
యమలోకానికి చేరటానికి 308 రోజుల సమయం పడుతుందట. దారిపొడవునా, కొరడాలతో కొట్టడం, పొడవటం యమభటులు చేసే పనులు. ఇక యమలోకం చేరిన తరువాత యమధర్మరాజు కాలయముడిగా పాపులకి కనిపిస్తాడట.
యముడి అతిభయంకర రూపం ఇదే. ఇక యముడి సమక్షంలో చిత్రగుప్తుడు ఈ ఆత్మ యొక్క పాపాల లెక్క బయటకు తీసిన తరువాత, పాపాలకు తగ్గ శిక్షలు వేస్తారట.
ఉదాహరణకు చెప్పాలంటే, మద్యపానం ఎక్కువ చేసినవారికి, ముగ్గురు యమభటుల్లో ఇద్దరు జీవాత్మ నోరు తెరిచి పట్టుకోగా, మరో యమభటుడు వేడి వేడి లోహాన్ని నోట్లో పోస్తారట. అపరిచితుడు సినిమాలో చూపించనట్టుగా, ఇలా ఒక్కో రకమైన తప్పుకి, ఒక్కో రకమైన శిక్ష వేస్తారు.
ఇక పుణ్యాత్ములకి యమలోకంలో ఘనస్వాగతం లభిస్తుంది. దారిపొడవునా, ఎలాంటి హింసలు ఉండవు. వారికి యమధర్మరాజు సౌమ్యరూపంలో కనిపిస్తారట.వారిని స్వర్గానికి మర్యాదలతో పంపిస్తారు. ఇక భక్తులకి దేవతలకు దొరికే స్వాగతం లభిస్తుంది. వారు స్వర్గానికి మించిన లోకం, నిర్వాణాన్ని చేరుతారు.
అంటే విష్ణువులో ఐక్యమవుతారు. ఇక పాపులు, శిక్షలు తీరిన అనంతరం, మళ్ళీ ఇంకో దేహాన్ని ధరిస్తారు. ఇదండి, హిందూ ధర్మం ప్రకారం చనిపోయిన తరువాత జీవాత్మ ప్రయాణం.
ఇక ఇస్లాం తీసుకున్నట్లయితే, కుడి ఎడమ భుజాలపైనా, మనకు కనిపించని ఇద్దరు ఉంటారు. వారు మన పాపపుణ్యాలను ఎప్పటికప్పుడు లెక్కకడతారు. ఇస్లాంలో, క్రిస్టియానిటీ లో చనిపోయిన తరువాత భుమిలో పాతిపెడతారు తప్ప, హిందూ ధర్మంలో లాగా, చితిపైన మృతదేహాన్ని కాల్చరు. అందుకు కారణం, యుగాంతంలో మన శరీరాలు సమాధిలోంచి లేచి, దేవుడికి లెక్కచెప్పవలసి ఉంటుంది.
పాపాలు చేసినవారు నరకానికి వెళ్ళి శిక్షలు అనుభవిస్తారు, ఇక పుణ్యాలు చేసి, దేవుడి నామస్మరణ చేసినవారు స్వర్గానికి వెళ్ళి సంపద, స్త్రీలు, ఇలా భౌతిక సుఖాలతో పాటు, ఐహిక సుఖాలను కూడా పొందుతారు.
క్రిస్టియానిటీ లో కూడా అంతే. ఇదండీ, ప్రధాన మతాల్లో మరణం వెనుక మతలబు. ఎవరు దేన్ని నమ్ముతారో అది వారి ఇష్టం. ఎటుతిరిగి భూమి మీద ఉన్నంత కాలం మనిషిలా ఉంటే చాలు.