ప్రపంచం అంతా కరోనా భయంతో వణికిపోతోంది. ఈ రెండేళ్ల కాలంలో ప్రపంచమంతటా 99శాతం ప్రజల ఆదాయాలు తగ్గి.. 16 కోట్ల మంది దుర్భర దారిద్య్రంలో మునిగిపోయారు. కానీ.. ధనవంతులు మాత్రం మహా సంపన్నులుగా మారుతున్నారు. వివిధ రూపాల్లో దశల వారిగా వృద్ది చెందుతున్న కొవిడ్ పై పరిశోధన చేపట్టిన ఆక్స్ ఫామ్ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. దావోస్ లో ప్రపంచ ఆర్థిక వేదిక ఆన్ లైన్ శిఖరాగ్ర సభ ప్రారంభమైన సందర్భంగా ప్రాణాంతక అసమానతలు అనే శీర్షికతో ఆక్స్ ఫామ్ ప్రత్యేక నివేదిక విడుదల చేసింది. కొవిడ్ కాలంలో ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు కుబేరుల పాలిట కల్పవృక్షాలయ్యాయని నివేదికలో పేర్కొంది.
కేంద్ర బ్యాంకులు తమ తమ దేశాల ఆర్థిక పునరుద్ధరణకు లక్షల కోట్ల డాలర్లను విడుదల చేయగా.. అవి స్టాక్ మార్కెట్ కు చేరి కుబేరుల సంపదను కొండంతలు చేశాయని నివేదించారు. ధనిక దేశాల ప్రభుత్వాలు కొవిడ్ టీకాలను తయారుచేయడానికి తమ ఫార్మా కంపెనీలకు వందల కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం చేయగా.. అవి టీకాలను అమ్ముకుని వేల కోట్లకు పడగలెత్తాయి. ఈ రెండేళ్లలో ప్రపంచంలోని 10 మంది మహా కుబేరుల సంపద రెట్టింపై 111 లక్షల కోట్ల రూపాయలకు ఎగబాకిందని పేర్కొంది. కొవిడ్ తెచ్చిపెట్టిన ఆర్థిక అసమానతల వల్ల ప్రపంచంలో ప్రతి 4 సెకన్లకు ఒకరి చొప్పున.. రోజుకు 21,000 మంది మరణిస్తున్నారనే దారుణ సత్యాన్ని బయటపెట్టింది.
భారత్ లోనూ ధనవంతులు మహాకుబేరులయ్యారు. దేశంలోని 10 మంది అతి సంపన్నుల వద్ద చేరిన ధనరాశులతో ప్రతి బిడ్డకూ 25 ఏళ్లపాటు పాఠశాల నుంచి ఉన్నత విద్య వరకు చదువు చెప్పవచ్చని ఆక్స్ ఫామ్ తెలిపింది. కొవిడ్ కాలంలో భారతీయ మహా సంపన్నుల సంఖ్య 39 శాతం పెరిగి 142కు చేరింది. వీరందరి వద్ద రూ. 53 లక్షల కోట్ల ధనం పోగుపడిందని వెల్లడించింది. దేశంలోని 55.5 కోట్లమంది నిరుపేదలకు మొత్తం రూ.43 లక్షల కోట్ల ఆస్తులు ఉండగా.. కేవలం 98 మంది వద్ద అంతే ఆస్తి ఉన్నట్టు పేర్కొంది.
98 మంది మహా కుబేరులపై ఒక్క శాతం సంపద పన్ను విధిస్తే.. ప్రపంచంలో అతిపెద్ద ఆరోగ్య బీమా పథకమైన ఆయుష్మాన్ భారత్ ను ఏడేళ్లపాటు నిర్విఘ్నంగా నడపవచ్చు. వీరి వద్ద ఉన్న సంపద కేంద్ర బడ్జెట్ కన్నా 41 శాతం ఎక్కువ. వారి మీద 4 శాతం సంపద పన్ను విధిస్తే రెండేళ్లపాటు కేంద్ర ఆరోగ్య.. కుటుంబ సంక్షేమ శాఖకు నిధులు సమకూర్చవచ్చని నివేదికలో పేర్కొరబడింది.