గత మూడు రోజులుగా వర్షంతో తడిసి ముద్దైన విశాఖపట్టణంలో ఆదివారం కూడా వర్షం కురుస్తుంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నేడు నగరంలో రెండో వన్డే జరగాల్సి ఉంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్పై మబ్బులు కమ్ముకున్నాయి.
ఉదయం నుంచీ నగరంలో భారీ వర్షం కురుస్తుండడంతో మ్యాచ్ నిర్వహణపై అనుమానాలు నెలకొన్నాయి. దీంతో ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసి మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు నిరాశలో మునిగిపోయారు. నగరంలో మొన్న, నిన్న కూడా వర్షం కురిసింది. దీంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ఈ ఉదయం మళ్లీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది.
వర్షం తగ్గినా మధ్యాహ్నం, రాత్రికి మళ్లీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది. దీంతో మ్యాచ్ నిర్వహణ కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ మధ్యాహ్నానికి వర్షం తగ్గి, తెరిపినిస్తే మ్యాచ్ను ఆలస్యంగానైనా మొదలుపెట్టాలని భావిస్తున్నారు. అదీ కుదరకపోతే ఓవర్లు కుదించి అయినా సరే మ్యాచ్ జరిపించాలని యోచిస్తున్నారు. వీటిలో ఏది జరగాలన్నా వరుణుడు శాంతించాల్సి ఉంటుంది.
ఇప్పటికే తొలి వన్డేలో గెలిచి సీరీస్ 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్.. ఎలాగైనా సిరీస్ ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఫస్ట్ వన్డేకు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రెండో వన్డేలో ఆడనున్నాడు. అటు మ్యాచ్ కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు.