ఓపెనర్ శుభ్ మన్ గిల్ డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. రికార్డులకు రికార్డులు సృష్టించాడు. 145 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేశాడు. ఫెర్గూసన్ బౌలింగ్ లో వరుసగా హ్యాట్రిక్ సిక్స్ లు బాదాడు. తన కళాత్మక షాట్లతో ఉప్పల్ స్టేడియాన్ని హోరెత్తించాడు. అతని ఇన్నింగ్స్లో 19 ఫోర్లు 8 సిక్సర్లు ఉన్నాయి. దీంతో భారత్ నిర్ణీత ఓవర్లలో భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 349 పరుగులు చేసింది.
ప్రత్యర్థి జట్టుకు 350 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకుముందు గిల్ సిక్సర్ తో 150కి చేరువయ్యాడు. వాషింగ్టన్ సుందర్ తో కలిసి ఆరో వికెట్ కు 43 పరుగులు జోడించాడు. కివీస్ బౌలర్లలో డారిల్ మిచెల్, హెన్రీ షిప్లే తలో రెండు వికెట్లు తీయగా.. మిచెల్ సాంతర్, బ్లెయిర్ టిక్నర్, లాకీ ఫెర్గూసన్ చెరో వికెట్ తీశారు.
వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఐదో భారత క్రికెటర్ గా శుభ్ మన్ గిల్ నిలిచాడు. సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ల తర్వాత గిల్ డబుల్ సెంచరీ ఫీట్ ను అందుకున్నాడు. అలాగే ఈ మ్యాచ్ తో వన్డేల్లో గిల్ వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. 19 ఇన్నింగ్స్ లు ఈ ఫీట్ ను అందుకున్నాడు. దీంతో గిల్ కోహ్లీ, ధావన్ రికార్డులను బ్రేక్ చేశాడు.
వన్డేల్లో హైదరాబాద్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా కూడా గిల్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక వన్డేల్లో ద్విశతకం చేసిన పిన్న వయస్కుడిగా కూడా గిల్ రికార్డు నెలకొల్పాడు. 23 ఏళ్ల గిల్ 132 రోజుల వయసులో ఆ రికార్డును తిరగరాశాడు.