భారత క్రికెటర్లను దేవుళ్లలా కొలుస్తూంటారు అభిమానులు. టీమిండియా గెలుపు తమ గెలుపుగా భావిస్తారు. ఇంతటి అభిమానులు ఉన్న టీమిండియా కూడా అందరి అంచనాలకు తగ్గట్టుగానే రాణిస్తోంది. ఈ క్రమంలోనే టీమిండియా ప్రపంచ క్రికెట్ చరిత్రలో హిస్టరీని రిపీట్ చేసింది. బోర్డర్-గవాస్కర్ సిరీస్ లో తొలి టెస్టులో ఘన విజయం సాధించి మంచి జోష్ మీదున్న టీమిండియా.. తాజాగా మరో ఘనత సాధించింది.
ఐసీసీ ప్రకటించిన క్రికెట్ ర్యాంకుల్లో టెస్ట్, వన్డే, టీ20 ఫార్మట్లతో భారత క్రికెట్ జట్టు నంబర్ వన్ స్థానంలో నిలిచింది. మూడు ఫార్మాట్లలో భారత జట్టు నంబర్ వన్ స్థానంలో నిలవడం ఇది రెండోసారి. ప్రస్తుతం రోహిత్ సేన 115 రేటింగ్ పాయింట్లతో అగ్ర స్థానంలో ఉండగా, 111 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలిచింది.
ఇంగ్లాండ్ (106), న్యూజిలాండ్ (100), సౌతాఫ్రికా (85) వరుసగా తర్వాతి ర్యాంకుల్లో ఉన్నాయి. కాగా గతంలో ఝార్ఖండ్ డైనమెట్ గా క్రికెట్ అభిమానులు పిలుచుకునే ధోనీ నాయకత్వంలో భారత జట్టు ఇలాగే మూడు ఫార్మట్లలో మొదటి స్థానంలో నిలిచింది.
అయితే ఈ ర్యాంకులు తాత్కాలికమే అయినా.. మూడు ఫార్మాట్లలో రెండుసార్లు నంబర్ వన్ గా నిలిచిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. టీమిండియా సాధించిన ఈ ఫీట్ ను క్రికెట్ అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు.