ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి మరోసారి పంజావిసురుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. గత కొద్దిరోజులుగా 8 వేలకు పైగా నమోదవుతోన్న కొత్త కేసుల సంఖ్య.. ఒక్కసారిగా 12 వేల మార్కు దాటింది. ముందురోజు కంటే 38.4 శాతం కేసులు అధికంగా రావడంతో ఆందోళన కలిగిస్తోందంటున్నారు అధికారులు.
ఈ మేరకు కరోనా కరోనా కేసులకు సంబంధించి గురువారం వైద్యారోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. బుధవారం 5.19 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 12,213 మందికి వైరస్ పాజిటివ్ గా తేలినట్టు పేర్కొంది. దీంతో పాజిటివిటీ రేటు 2.35 శాతానికి చేరిందని వివరించింది.
మహారాష్ట్రలో 4,024, కేరళలో 3,488, ఢిల్లీ, కర్ణాటకతో సహా పలు రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి ఆందోళనకరంగా మారిందని ఆరోగ్య శాఖ చెప్తోంది. ఒక్క ముంబయిలోనే రెండువేలకుపైగా కేసులు నమోదైనట్టు పేర్కొంది. ఢిల్లీలో వరుసగా రెండోరోజు 1,100 మందికి పైగా కరోనా బారినపడ్డట్టు ప్రకటించింది ఆరోగ్య శాఖ.
ఈ రెండేళ్లలో మొత్తం 4.32 కోట్ల మంది మహమ్మారి భారిన పడినట్టు వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 58,215 యాక్టివ్ కేసులుండగా.. మొత్తం కేసుల్లో దీని వాటా 0.12 శాతంగా ఉంది. 24 గంటల్లో 7,624 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ 4.26 కోట్ల మందికిపైగా కోలుకోవడంతో రికవరీ రేటు 98.66 శాతంగా కొనసాగుతోందని వెలడైంది.
గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆరోగ్య శాఖ రికార్డుల్లో పేర్కొంది. ఈ ఏడాదిన్నర కాలంలో 195 కోట్లకు టీకా డోసులు పంపిణీ అయినట్టు తెలిపింది ఆరోగ్య శాఖ. గడిచిన 24 గంటల్లో 15.21 లక్షల మంది టీకాలు అందించిట్టు ప్రకటించారు అధికారులు.