మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇండియా పై ప్రశంసల జల్లు కురిపించారు. ”గేట్స్ నోట్స్” అనే తన బ్లాగ్ లో భారత్ సాధిస్తున్న విజయాల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచం అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్న సమయంలో కూడా భారత్ భవిష్యత్తు పై ఆశ కల్పిస్తోందని ఆయన పేర్కొన్నారు.
భూమి పై ఉన్న ఇతర దేశాల మాదిరిగానే భారత దేశం కూడా పరిమిత వనరులను కలిగి ఉందని, అయినప్పటికీ సవాళ్లను అధిగమించి ఎలా పురోగతి సాధించగలదో భారత్ చేసి చూపించిందని బిల్ గేట్స్ అన్నారు. ఇండియా పెద్ద సమస్యలను ఒకేసారి పరిష్కరించగలదని నిరూపించిందని ఆయన అన్నారు. భారత్ సాధించిన అద్భుతమైన పురోగతికి మించిన రుజువు లేదని పేర్కొన్నారు.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించిందని, పెద్ద సవాళ్లను ఎదుర్కొనగలదని నిరూపించిందని అన్నారు. దేశంలో ఉన్న పోలియోను తరిమికొట్టింది. హెచ్ఐవి వ్యాప్తిని కూడా తగ్గించింది. పేదరికాన్ని కూడా కంట్రోల్ చేసింది, శిశు మరణాలను తగ్గించింది, పారిశుద్ధ్యం మరియు ఆర్థిక సేవలకు సౌకర్యాలను పెంచిందని కూడా ఆయన ప్రస్తావించారు.
భారత్ ప్రస్తుతం ఆవిష్కరణలకు కేంద్రంగా మారిందని, ప్రాణాంతక డయేరియా కేసులకు కారణం అయ్యే వైరస్ ను నిరోధించడానికి రోటా వైరస్ వ్యాక్సిన్ ను తయారు చేసి ప్రతీ బిడ్డకు చేరేలా చేసిందని అన్నారు. భారత నిపుణులు, గేట్స్ ఫౌండేషన్ సహకారంతో పెద్ద ఎత్తున వ్యాక్సిన్స్ పంపిణీ చేసే మార్గాలను రూపొందించిందని, 2021 నాటికి 83 శాతం మంది ఏడాది వయసు ఉన్న పిల్లలకు రోటా వైరస్ టీకాలు వేసిందని అన్నారు. ఈ తక్కువ ధర వ్యాక్సిన్ ను ప్రపంచంలోని అన్ని దేశాలు ఉపయోగిస్తున్నాయని ఆయన వివరించారు.
ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధనల్లో గేట్స్ ఫౌండేషన్, భారత ప్రభుత్వ రంగ సంస్థలతో చేతులు కలిపిందని తెలిపారు. వాతావరణ మార్పుల వంటి అంశాలను కూడా గేట్స్ ప్రస్తావించారు. అంతేకాకుండా వచ్చే వారం భారత్ కు వస్తున్నట్లు ఆయన తన బ్లాగులో పేర్కొన్నారు. రిమోట్ అగ్రికల్చర్ కమ్యూనిటీలలో వ్యర్థాలను, జీవ ఇంధనాలుగా, ఎరువులుగా మార్చడానికి బ్రేక్ త్రూ ఎనర్జీ ఫెల్ విద్యుత్ మోహన్ ఆయన టీం చేస్తున్న పరిశోధనలను పరిశీలించనున్నట్లు వెల్లడించారు.