బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్, ఆయన సతీమణి అక్షతామూర్తి.. బ్రిటన్ అపరకుబేరుల జాబితాలో చేరారు. ‘బ్రిటన్ రిచ్ లిస్ట్’ పేరిట సండే టైమ్స్ పత్రిక.. 250 మంది సంపన్నుల జాబితాను విడుదల చేసింది. అందులో తొలిసారిగా భారత సంతతికి చెందిన దంపతులు చోటుదక్కించుకున్నారు. వారికి 222వ స్థానం దక్కింది.
అయితే.. వీరిద్దరి మొత్తం సంపద 730 మిలియన్ పౌండ్లుగా ఉన్నట్టు సండే టైమ్స్ పేర్కొంది. అక్షతా మూర్తి.. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె కావడంతో.. ఆ సంస్థలో ఆమెకు 0.9 శాతం వాటా ఉంది. ప్రస్తుతం బ్రిటన్ ప్రజలు.. నానాటికీ పెరుగుతున్న నిత్యావసర ధరలను తాళలేక అల్లాడిపోతున్నారు.
రాబోయే రోజులు ఆర్థికంగా మరింత సంక్లిష్టంగా మారుతాయని ఇటీవలే రిషి సునక్ హెచ్చరించారు. ఈ సమయంలో రిషి సునక్ కు ధనవంతుల జాబితాలో చోటు దక్కడం చర్చనీయాంశమైంది. కాగా.. బ్రిటన్ లో అక్షతామూర్తి పన్నులు చెల్లించడంలేదన్న కారణంగా ఆమెపై ఇటీవల కాలంలో విమర్శలు వెల్లువెత్తాయి.
కాగా..2847 కోట్ల పౌండ్ల సంపదతో హిందూజా సోదరులు అగ్ర స్థానంలో నిలవగా.. వీరుకూడా భారత సంతతికి చెందిన వారే కావడం గమనార్హం. మరోవైపు బ్రిటన్ కు చెందిన సర్ జేమ్స్ డైసన్ కుటుంబం 2300 కోట్ల పౌండ్ల ఆదాయంతో రెండవ స్థానం దక్కించుకోగా.. తిరిగి మూడో స్థానాన్ని సైతం భారత సంతతికి చెందిన రూబెన్ సోదరులు 2226 కోట్ల పౌండ్ల సంపదను కలిగి ఉన్నట్టు సండే టైమ్స్ ప్రచురించింది.