ఊరినే ఇల్లులా భావిస్తుంది ఆగ్రామం. నాగరికత ఇంతగా వృద్ధి చెందినా ఇప్పటికీ ఇక్కడి ప్రజలు కాళ్లకి చెప్పులు,బూట్లూ వేసుకోరంటే నమ్ముతారా.అట్లుంటది వీళ్లతోని. కొన్ని ఏళ్లనుంచి ఈ కఠిన నియమం పాటిస్తున్నారు.
ఈ నియమం వీళ్లకి మాత్రమే కాదు బయట వాళ్లకి కూడా వర్తింపజేస్తారు.ఇంకో విచిత్రం ఏంటంటే ఎంత జబ్బు చేసినా ఆసుపత్రికి కూడా పోరు.అందుకే ఈ ఊళ్లో ఆసుపత్రికూడా ఉండదు.
చిత్రంగా ఉంది కదూ.! ఇవే కాదు ఇంకా విడ్డూరాలు ఉన్నాయి. ఆలస్యం ఎందుకు ఆ ఊరికథ తెలుసుకుందాం. ఆంధ్ర ప్రదేశ్ లోని వేమన ఇండ్లు గ్రామం ఉందని చాలా మందికి తెలియక పోచ్చు. తిరుపతికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో 25 కుటుంబాలు నివసిస్తున్నాయి.
ఈ గ్రామంలో మొత్తం జనాభా 80 మంది. గ్రామం చాలా చిన్నదే అయినప్పటికీ, ఇక్కడ నియమాలు, సంప్రదాయాలు ప్రత్యేకమైనవి. గ్రామంలోని చాలా కుటుంబాల వారు నిరక్షరాస్యులు. పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తారు.
పలు కథనాల ప్రకారం, పాల్వేకారి వర్గానికి చెందిన వారు ఈ గ్రామంలో నివసిస్తున్నారు. తమను తాము దొరవర్లుగా గుర్తించుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో ఈ కులాన్ని వెనుకబడిన తరగతిలోనే ఉంచారు.ఇప్పుడు ఇక్కడి నియమాల గురించి చెప్పాలంటే, ఇక్కడ ఎవరూ ఆసుపత్రికి వెళ్లరు.
తాము పూజించే దేవుడే అన్నీ చూసుకుంటాడని నమ్ముతారు. ఆ గ్రామంలోనే ఒక గుడి ఉండడంతో అక్కడే వారు పూజలు చేస్తూ ఉంటారు. కాబట్టి తిరుపతికి వెళ్లి వెంకటేశ్వర స్వామిని కూడా పూజించరు.
ఇక్కడే ఓ వేప చెట్టు కూడా ఉంది. ఎవరికైనా, ఎప్పుడైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు దాని చుట్టూ తిరుగుతారు. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు కానీ ఆసుపత్రికి వెళ్లరు. బయట నుంచి ఎవరైనా వచ్చినా షూస్ విప్పి ఊరికి వెళ్లాలన్నంత కఠినంగా ఈ రూల్ ఉంటుంది.
ఉన్నతాధికారులు సైతం ఈ నిబంధనను కచ్చితంగా పాటించాలి. ఇంకొక సంప్రదాయం ఏమిటంటే, ఊరిలో ఎవరైనా బయటి నుంచి వస్తే, అతను స్నానం చేయకుండా లోపలికి రాకూడదు. పీరియడ్స్ సమయంలో ఆడవారిని ఊరి బయట ఉంచుతారు. వారికి అన్ని వస్తువులు అక్కడికే తెచ్చి ఇస్తారు.