బీఆర్ ఎస్ ప్రభుత్వం పై తెలంగాణ ఆత్మగౌరవ వేదిక అధ్యక్షురాలు ఇందిరా శోభన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు హైదరాబాద్ లోని ధర్నాచౌక్ వద్ద ఆత్మ గౌరవ వేదిక ధర్నా ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలో మహిళలంటే గౌరవం లేదు. భక్తి లేదు. అసలు ఈ ప్రభుత్వానికి మహిళలను గౌరవించే సంస్కృతే లేదు అంటూ ఆమె మండిపడ్డారు.
నిత్యం ఎక్కడో ఒక దగ్గర మహిళలపై అత్యాచారాలు హత్యలు వేధింపులతో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో మహిళలు బతుకమ్మ బోనాలతో తెలంగాణ కావాలని పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కానీ ఈనాడు తెలంగాణ వచ్చిన తరువాత ఆ మహిళలు వివక్షతకు గురవుతున్నారు.
మహిళా సాధికారత అనేది మాటల్లోనే ఉంది తప్ప చేతల్లో లేదు.హత్యలు, అత్యాచారాలు లేని తెలంగాణ మా ఆత్మగౌరవం, చట్ట సభల్లో మహిళా సాధికారత మా ఆత్మగౌరవం. బెల్ట్ షాపు రద్దుతో మద్యపాన నియంత్రణతో మా ఆడబిడ్డల మానప్రాణాలు కాపాడుకోవడం మా ఆత్మగౌరవం. ఇవన్నీ ఇప్పుడు తెలంగాణలో కొరవడినవి అందుకే తెలంగాణ ఆత్మగౌరవ వేదిక ఆధ్వర్యంలో నేను ధర్నా చౌక్ ఇందిరా పార్కు వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున దీక్ష చేస్తున్నాను.
ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల మహిళ సోదరీమణులకు ప్రజా సంఘాలకు ఇదే నా ఆహ్వానం అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాను. తెలంగాణ భవన్ లో జరిగిన మహిళా దినోత్సవంలో కూడా నా ఆడబిడ్డల ఆత్మగౌరవం బంగపడ్డది అని ఇందిరా శోభన్ వ్యాఖ్యానించారు.