మధ్యప్రదేశ్ ఇండోర్ లోని విజయ్ నగర్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. స్వర్ణ్ బాగ్ కాలనీలోని ఓ రెండంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు మంటల్లో చిక్కుకున్న 9 మందిని రక్షించగా.. ఏడుగురు సజీవదహనమయ్యారు. గాయాలైన వారిని ఆస్పత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
భవనంలోని ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగుంటుందని భావిస్తున్నారు అధికారులు. పార్కింగ్ లో ఉంచిన వాహనాలు కూడా దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 3 గంటలు శ్రమించి.. మంటలు అదుపులోకి తెచ్చారు.
ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులకు ఫోన్ చేసి తెలుసుకున్నారు.
మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు సీఎం. ఘటనపై విచారణ జరిపి.. నిర్లక్ష్యంగా వ్యవహరించినవారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.