విశాఖపట్నంలోని కెమికల్ గ్యాస్ లీక్ ప్రమాదంపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. ప్రమాదంపై విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, జిల్లా పరిశ్రమల అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి గౌతమ్ రెడ్డి తక్షణమే ప్రాణ నష్ట నివారణకు అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమకు చుట్టుపక్కల గ్రామాలైన నరవ, ఆర్.ఆర్ పురం, టైలర్స్ కాలనీ, నరవ, బి.సీ కాలనీ, బాపూజీనగర్, కంపరపాలెం, కృష్ణానగర్ తదితర ప్రజలకు సాయంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సూచనలిచ్చారు. ఉన్నపలంగా ఇళ్లను వదిలి వచ్చిన స్థానిక ప్రజలకు ఏ లోటు లేకుండా చూడాలని కలెక్టర్ కి సూచించారు మంత్రి గౌతమ్ రెడ్డి.
జిల్లా యంత్రాంగానికి సహకారంగా చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాలవలెవన్ కు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ యంత్రాంగం శ్రమిస్తోంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని.. అందరినీ రక్షించుకుంటామని మంత్రి తెలిపారు. * బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని గౌతమ్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి స్థానిక ప్రజలను అధికారులు,యువత దూరంగా తరలించడం అభినందనీయమన్నారు.