శ్రీచైతన్య కాలేజీకి షాక్ ఇచ్చింది ఇంటర్ బోర్డు. నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీ అనుమతిని శాశ్వతంగా రద్దు చేస్తూ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల నార్సింగిలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి సాత్విక్ సూసైడ్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన మరువకముందే రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు చాలా చోటుచేసుకుంటున్నాయి.
ఈ ఘటనలతో అలర్ట్ అయిన తెలంగాణ ప్రభుత్వం సోమవారం కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలతో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి అరుణ అధ్యక్షతనే ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశానికి ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్, బోర్డు అధికారులు, కాలేజీల యాజమాన్యాల బోర్డు సభ్యులు హాజరయ్యారు.
ఇటీవల సాత్విక్ అనే విద్యార్థి సూసైడ్ ఘటన ఇంటర్, పోటీ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమీక్షలో చర్చించారు. మొత్తం 14 కార్పొరేట్ కాలేజీలకు అధికారులు ఆహ్వానం పంపించారు.
అయితే అత్యంత కీలకమైన ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దూరంగా ఉండటం హాట్ టాపిక్ గా మారింది. ఓ వైపు స్టూడెంట్స్ పిట్టల్లా రాలుతుంటే మరో వైపు కీలక సమావేశానికి సబితా గైర్హాజరు కావడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ముందుగా అనుకున్న జిల్లా పరిషత్ సమావేశం ఆలస్యం కావడం వల్లే మంత్రి సబితా ఈ మీటింగ్ కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.