మహిళలపై ఆఘాయిత్యాలు అరికట్టేందుకు తెచ్చిన దిశ బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన రోజే గుంటూరు సిటీలో దారుణం చోటు చేసుకుంది. ఐదేళ్ల వయసున్న పాపపై తాడిపత్రి లక్ష్మారెడ్డి అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై మహిళా సంఘాలు తీవ్రస్థాయిలో స్పందించాయి. బాధితురాలు చికిత్స పొందుతున్న జీజీహెచ్ ఆస్పత్రి వద్దకు పెద్దఎత్తున చేరుకొని.. నిరసన తెలిపాయి. నిందితుడిని ఎన్కౌంటర్ చేస్తారా లేదా అని ప్రభుత్వాన్నిప్రశ్నించాయి. నగరంపాలెం పోలీస్స్టేషన్ పరిధిలో తల్లి, అమ్మమ్మలతో బాధిత బాలిక కలిసి ఉంటోంది. భర్తకు దూరంగా నర్సుగా పనిచేస్తూ ఆమె తల్లి కుటుంబాన్ని పోషిస్తోంది. వారికి ఇద్దరు పిల్లలు కాగా, బాలిక తల్లి వద్ద, కుమారుడు తండ్రి వద్ద పెరుగుతున్నారు. ఇంటికి సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో బాలిక యూకేజీ చదువుతోంది. అదే ఇంట్లో ఉంటున్న లక్ష్మారెడ్డి ఇంటర్ చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం భోజనం చేసి రెండు గంటల సమయంలో తల్లి డ్యూటీకి వెళ్లింది. అమ్మమ్మ గంట తర్వాత రైతు బజారుకు వెళ్లింది. కొద్దిసేపటికి బడి నుంచి బాలిక ఇంటికి వచ్చింది. ఆమె ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని లక్ష్మారెడ్డి అవకాశంగా తీసుకొని అత్యాచారం చేశాడు.
రాత్రి డ్యూటీ నుంచి ఇంటికొచ్చిన తల్లితో తన పొత్తికడుపుతో నొప్పిగా ఉన్నదని చెప్పి బాలిక ఏడ్చింది. ఏం జరిగిందని అడిగిన తల్లికి, జరిగిన విషయమంతా చెప్పింది. ఆ వెంటనే కుమార్తెను వెంటపెట్టుకొని వెళ్లి నగరంపాలెం పోలీస్స్టేషన్లో తల్లి ఫిర్యాదు చేసింది. ఐపీసీ 376, పోక్సో చట్టం, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నట్టు సమాచారం. విషయం బయటకు రావడంతో మహిళా సంఘాలు ఆస్పత్రి వద్దే ఆందోళన చేపట్టాయి. బాలికను పరామర్శించి, తల్లిని వివరాలు అడిగి తెలుసుకున్నాయి.
ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా రోజుల వ్యవధిలోనే నిందితుడికి కఠినశిక్ష పడేలా చూడాలని గుంటూరు నగర తెలుగు మహిళా అధ్యక్షురాలు పానకాల వెంకట మహాలక్ష్మి, బీజేపీ మహిళా నేత బొల్లా ప్రగడ శ్రీదేవి, దళిత బీజేపీ నేత దర్శనపు శ్రీనివాస్ పరామర్శించారు. కాగా, నిందితుడు లక్ష్మారెడ్డి ఇంటర్మీడియేట్ చదువుతున్నప్పటికీ పదో తరగతి సర్టిఫికెట్ల ప్రకారం అతని వయసు 19 ఏళ్లుగా పోలీసులు నిర్ధారించారు.