ప్రపంచ వ్యాప్తంగా జూన్ 21 ని ప్రజలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ ఏడాది ఎనిమిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను యోగా ఫర్ హ్యుమానిటీ అనే అంశంతో జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి.
ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన యోగా డే సెలబ్రేషన్స్ కు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ సందర్భంగా యోగా గురించి మాట్లాడారు. యోగా వల్ల యూనిటీ, ఇంటిగ్రిటీ, శరీరానికి ఆరోగ్యం వస్తుందని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ప్రస్తుత జనరేషన్ కూడా యోగాను చెయ్యాలని వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు.
యోగాకు కుల, మత పరిమితులు లేవు
యోగా చేయడం వల్ల ఆత్మశక్తిని ఏకం చేయవచ్చని , యోగా అంటే ఇంద్రియాలని ఏకం చేయడం అని ఆయన అన్నారు. యోగా ప్రాచీనమైనదే అయినప్పటికీ దానికి కాలదోషం లేదని, అన్ని కాలాలలోనూ యోగాను చేయవచ్చని పేర్కొన్నారు.
యోగాకు కుల, మతం వంటి పరిమితులు లేవని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా యోగాను ప్రసిద్ధం చేసినందకు గానూ ప్రధాని మోడీకి , యోగాని కనుగొన్న మన పూర్వీకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఆరోగ్యమే మహా భాగ్యం.. అది యోగాతోనే సాధ్యం
ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పారని ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని ఆరోగ్యంగా ఉంటే మహా భాగ్యం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. యోగా చేసి దేశాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దుదామన్నారు. యోగ సాధనతో ప్రపంచ శాంతి చేకూరుతుందని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. యోగా ఒత్తిడిని పోగొడుతుందని పేర్కొన్నారు.
ప్రజలందరూ యోగా మహోత్సవాన్ని విజయవంతం చేసినందుకు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆరోగ్యం కోసం అందరూ యోగా చేయాలి: కిషన్ రెడ్డి
భారత ఉపరాష్ట్ర పతి తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అంతర్జాతీయ యోగా డే కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో పాటు సినీ నటులు అడవి శేష్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, బీజేపీ నేతలు ఈటల రాజేందర్, వివేక్ వెంకట్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ… అందరు ఆరోగ్యంగా ఉండేందుకు తప్పనిసరిగా యోగా చేయాలని అన్నారు. యోగాను అందరూ అలవాటుగా మార్చుకోవాలని పేర్కొన్న కిషన్… పాఠశాలల్లో యోగాను తప్పనిసరి చేయాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయన్నారు.
శారీరక, మానసిక ఆరోగ్యం కోసం యోగా చేయడం ఎంతో ఉత్తమమని కిషన్ రెడ్డి వెల్లడించారు.