ఐపీఎల్ వేలం రెండోరోజున టీమిండియా అండర్-19 ఆటగాళ్ల పంటపండింది. ఇటీవలే భారత కుర్రాళ్లు వెస్టిండీస్ లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ గెలిచారు. ఇందులో విశేష ప్రతిభ కనబర్చిన యువకుల కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ఆల్ రౌండర్ రాజ్ అంగ్ బవాను రూ.2 కోట్లతో పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేయగా చేసింది.
మరో ఆల్ రౌండర్ రాజ్ వర్ధన్ హంగార్గేకర్ ను రూ.1.5 కోట్లతో చెన్నై సూపర్ కింగ్స్ చేజిక్కించుకుంది. రాజ్ బవా మీడియం పేస్ బౌలింగ్ తో పాటు మిడిల్ ఓవర్లలో ఉపయుక్తమైన రీతిలో బ్యాటింగ్ కూడా చేయగలడు. ఇక హంగార్గేకర్ టీనేజ్ వయసులోనే స్పీడ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. వేగంగా బంతులు విసరడమే కాదు.. ఆఖర్లో బ్యాట్ తోనూ విరుచుకుపడే సత్తా ఉన్న ప్లేయర్.
అందుకే.. వీరికి ఐపీఎల్ వేలంలో బాగా గిరాకీ ఏర్పడింది. వీళ్లు ఇంకా జూనియర్ క్రికెటర్లే అయినప్పటికీ.. కోటి రూపాయలకు పైగా ధర పలకడం వారి ప్రతిభకు నిదర్శనమని క్రికెట్ అభిమానులు చెప్తున్నారు.
ఇక.. టీమిండియా అండర్-19 జట్టును విజేతగా నిలిపిన కెప్టెన్ యశ్ ధూల్ కు వేలంలో రూ.50 లక్షల ధర పలికింది. ఎప్పుడు కుర్రాళ్లతో ముందుకెళ్లే ఢిల్లీ క్యాపిటల్స్ యశ్ ధూల్ ను కొనుగోలు చేసింది.