సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. చెన్నైలోని ఆమె ఇంట్లో నుంచి సుమారు 48 తులాల బంగారం, వజ్రాభరణాలు చోరికి గురైనట్లు తెయాన్ మెట్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. లాకర్ లో పెట్టిన నగలు కనిపించడం లేదని ఆమె పేర్కొన్నారు.
2019లో తన చెల్లెలు సౌందర్య పెళ్లికి నగలు వేసుకున్న తరువాత వాటిని తన లాకర్లో ఉంచానని.. తర్వాత 2021 ఆగస్టు వరకు ఆ లాకర్ సేయింట్ మేరీస్ రోడ్డు లోని తన అపార్ట్ మెంట్ లో ఉంచానని.. హీరో ధనుష్ తో కలిసి ఉన్న సమయంలో వాటిని అక్కడికి మార్చినట్లు పేర్కొంది.
2022 లో తన తండ్రి రజినీకాంత్ పోస్ గార్డెన్ ఇంటికి షిఫ్ట్ చేసినట్లు ఐశ్వర్య తెలిపింది. ఆ లాకర్ కి సంబంధించిన తాళాలు అపార్ట్ మెంట్ లోనే ఉంటాయని.. వాటి గురించి తన ఇంట్లో పనిచేసే ముగ్గురికి తెలుసునని.. తన నగలు, వజ్రాల చెవి దిద్దులు, బంగారు గాజులు కనిపించకుండా పోయినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
సెక్షన్ 381 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఐశ్వర్య ప్రస్తుతం లాల్ సలామ్ సినిమాతో బిజీగా ఉన్నారు. షూటింగ్ కోసం తమిళనాడు వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఆమె ఇంట్లో లేకపోవడంతో ఈ చోరీ జరిగినట్టు తెలుస్తోంది.