భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ ఏడాది తొలి ప్రయోగానికి సిద్ధమైంది. సోమవారం పీఎస్ఎల్వీ సీ-52 ని పరీక్షించనుంది. ఈ ప్రయోగానికి సంబంధించి కౌంట్ డౌన్ మొదలైంది. ఆదివారం తెల్లవారుజామున 4.29 గంటలకు కౌంట్ డౌన్ ను ప్రారంభించారు. మొత్తం 25 గంటల 30 నిమిషాల పాటు కౌంట్ డౌన్ కొనసాగనుంది.
సోమవారం ఉదయం 5.59 గంటలకు శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకుపోనుంది. పీఎస్ఎల్వీ ప్రయోగ ప్రక్రియను ఇస్రో ఛైర్మన్ సోమ్ నాథ్ పర్యవేక్షిస్తున్నారు.
ఈ ప్రయోగం ద్వారా మూడు ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. వీటిలో ఐఆర్ శాట్ 1ఏ, ఐఎన్ఎస్ 2టీడీ, విద్యార్థులు రూపొందించిన ఇన్ స్పైర్ శాట్ 1 ఉపగ్రహాలు ఉన్నాయి.
పీఎస్ఎల్వీ-సీ 52 భూ పరిశీలన ఉపగ్రహం ఈఓఎస్ -04 కక్ష్యలో 1710 కిలోల బరువుతో 529 కి.మీ సూర్య సింక్రోనస్ ధ్రువ కక్ష్యలోకి ప్రవేశించడానికి రూపొందించబడిందని సోమ్ నాథ్ వెల్లడించారు.