నిజామాబాద్ లో 50 కోట్లతో నిర్మిస్తున్న ఐటీ హబ్ ను త్వరలో ప్రారంభించనున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. శనివారం ఐటీ హబ్ భవన సముదాయాన్ని అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా, బీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మహేశ్ గుప్తాతో కలిసి ఆమె పరిశీలించారు.
చివరి దశకు చేరుకున్న పనులను, భవనంలో మౌలిక సదుపాయాల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. నిజామాబాద్ లో ఐటీ హబ్ నిర్మాణానికి ఎంతో శ్రద్ధ చూపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ కు ఆమె ధన్యవాదాలు తెలిపారు.యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా ఐటీ హబ్ నిర్మాణం జరుగుతోందన్నారు.
50 కోట్ల వ్యయంతో 750 మంది యువతకు, 4 వేల ఇతర ప్రాంత వాసులకు ఉద్యోగ,ఉపాధి అవకాశం లభిస్తుందన్నారు. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలను తీసుకువెళ్లాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఐటీ హబ్ లను నిర్మిస్తున్నారని కవిత వెల్లడించారు.
అతి త్వరలో కేటీఆర్ చేతుల మీదుగా ఐటీ హబ్ ను ప్రారంభిస్తామని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఇంకా ఎన్నో పరిశ్రమలు నిజామాబాద్ కు రానున్నాయన్నారు. జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని కవిత తెలిపారు. తెలంగాణలో కలలు కన్న ప్రగతి సాధ్యమవుతుందని ఆమె అన్నారు.