నిన్నటి బీఆర్ఎస్ బహిరంగ సభ పై టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ తప్పా..సభను ఎవరు పట్టించుకోలేదని చెప్పారు. సభకు వచ్చిన జనాలు, నేతలు మనస్ఫూర్తిగా పాల్గొనలేదని ఎద్దేవా చేశారు. బెదిరించి సభను సక్సెస్ చేయాలని చూసారని ఆరోపించారు.
కర్నాటక మాజీ సీఎం, బీహార్ సీఎం నితీశ్ కూడా రాలేదన్నారు సంజయ్. కేసీఆర్ దగ్గర ఉన్న లిక్కర్ డబ్బులు పంచుకోవడానికి జాతీయ నేతలు వచ్చినట్లున్నారని ఆయన సెటైర్ వేశారు. కేసీఆర్ నోట ఏ దేశం మాట వచ్చినా ఆ దేశం సర్వనాశనం అవుతుందని అన్నారు బండి. పాకిస్థాన్ గురించి మాట్లాడితే అక్కడ తిండి గురించి కొట్లాడుకుంటున్నారని అన్నారు. దయచేసి భారత దేశం బాగుందని కేసీఆర్ నోటి వెంట ఆ మాట రావద్దని కోరుకుంటున్నానని మీడియా ముఖంగా కేసీఆర్ పై ఆరోపణలు గుప్పించారు.
తెలంగాణలో 21 డ్యాంల నిర్మాణాలను 8 ఏళ్ళ నుండి పెండింగులో పెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియదన్నారు. పొలం దగ్గర ఫ్రీ కరెంట్ అని ఇంటి దగ్గర కరెంట్ కు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ముందు డిస్కంలకు కట్టాల్సిన బకాయిలు చెల్లించాలన్నారు. ఫ్రీ కరెంట్ ఇస్తే ఆ ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. కేసీఆర్ ఒక జోకర్, ఆయన జోకర్ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు బండి సంజయ్.
నిన్న ఖమ్మంలో సభలో ఇచ్చిన స్పీచ్ గతంలో మాట్లాడిందే.. కొత్తగా ఏం మాట్లాడలేదని అన్నారు. కేసీఆర్ వేషం, భాష తుపాకి రాముడు మాటలే అని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించిన సమాజ్ వాదీ పార్టీతో కేసీఆర్ జతకట్టాడని అన్నారు. దళితులను వంచించిన కేసీఆర్ కు వాళ్ల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ఖమ్మం సభలో కనీసం జై తెలంగాణ అని మాట్లాడలేదని గుర్తు చేశారు. ఖమ్మం సభకు వచ్చిన నలుగురు నేతలు నాలుగు స్కాంలలో ఉన్నారని ఆరోపించారు. ఒక్క నేత బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడలేదని వ్యంగాస్త్రం వేశారు. దేశంలో వచ్చేది ఆప్ ప్రభుత్వం అని కేజ్రీవాల్ ప్రకటించాడని, మరి బీఆర్ఎస్ సంగతి ఏంటీ అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.