కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఉద్యోగుల బదిలీలు అంటూ 317 జీవోను తీసుకువచ్చి.. ఉద్యోగులను ఆత్మహత్యలు చేసుకునేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఉద్యోగులతో చర్చించకుండా ఇష్టం వచ్చినట్లు సీఎం వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
నెటివిటీ లేక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని.. పార్టీల నాయకులు చెప్పిన వినకుండా సీఎం మొండి వైఖరి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. నేను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టు సీఎం వ్యవహరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో రాచరికపు పాలన సాగిస్తూ.. ప్రజల జీవితాలను ఊబిలోకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఇటీవల నర్సంపేట వాసి ఉప్పుల రమేష్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. దేశంలో ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు తెలంగాణలో తప్ప ఎక్కడా లేవన్నారు. ఉద్యోగులవి ఆత్మహత్యలు కాదు అవన్నీ ప్రభుత్వ హత్యలేనని మండిపడ్డారు.
ఉద్యోగుల సంఘాలతో చర్చించి వెంటనే ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉప్పుల రమేష్ కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందన్నారు. ఆర్దిక సహాయంగా రూ. 50 వేలు అందించారు ఈటల. ప్రభుత్వం స్పందించి వెంటనే బాధిత కుటుంబానికి నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు ఈటల.