కిచ్చా సుదీప్ నటించిన పాన్ ఇండియా త్రీడీ మూవీ ‘విక్రాంత్ రోణ’ వచ్చే నెల 28న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రలో నటించింది. అయితే.. ఇటీవల ట్రైలర్ విడుదలైనప్పుడు ముంబై, బెంగళూరులో జరిగిన మీడియా సమావేశాలకు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హాజరైంది.
కానీ.. ఆ తర్వాత జరిగిన కొచ్చి, చెన్నయ్, హైదరాబాద్ లోని ట్రైలర్ లాంచ్ కార్యక్రమాలకు మాత్రం ఆమె దూరంగా ఉంది. ఈ విషయంపై చిత్ర పరిశ్రమలో చర్చ జోరందుకుంది. కాగా.. హైదరాబాద్ లో నిర్వహించిన ఓ ప్రెస్ మీట్ లో యాంకర్ సూటిగా సుదీప్ నే ఈ విషయం గురించి ప్రశ్నించింది. ‘అక్కడకు వచ్చి, ఇక్కడకు జాక్వెలిన్ రాకపోవడానికి ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా?’ అని అడిగింది.
దానికి సుదీప్ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. ‘మూవీ ప్రమోషన్ కోసం హైదరాబాద్ కూ జాక్వెలిన్ వస్తే బాగానే ఉండేదని కానీ.. ఇప్పటికే తమ బడ్జెట్ దాటిపోయిందని.. ఇప్పుడు మొత్తం ఖర్చు ప్రమోషన్స్ మీదనే పెడుతున్నామని చెప్పాడు. అయితే.. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే జాక్వెలిన్ కోసం నిర్మాత జాక్ మంజునాథ్ కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వార్తలు వచ్చాయి. ఆమెకోసం, ఆమె స్టాఫ్ కోసం సకల సౌకర్యాలు కలిగించడానికి డబ్బులను నీళ్ళలా ఖర్చు పెట్టారని వార్తా కథనాలు వెల్లువెత్తాయి.
ఇప్పుడు ప్రమోషన్స్ సమయంలో మరోసారి ఆమె కోసం భారీ ఖర్చును భరించలేకే స్వస్తి పలికారని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం సల్మాన్ ఖాన్ కూడా ముందుకు వచ్చారని.. ఆయన హైదరాబాద్ కు కూడా రావాలనుకున్నారని సుదీప్ చెప్పారు. ప్రొటోకాల్ కారణంగా పబ్లిక్ మీటింగ్స్ కు ఆయన హాజరుకాలేకపోయారని వివరణ ఇచ్చారు కిచ్చా.