– నిరసన స్వరం వినిపిస్తున్న ఒక్కో నేత
– ఆనం, కోటంరెడ్డి బాటలో మరొకరు
– చిచ్చు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్
– నెల్లూరులో అసంతృప్తి జ్వాలలు
– పార్టీ వీడే యోచనలో సీనియర్ ఎమ్మెల్యేలు
– ఇప్పటికే కోటంరెడ్డి క్లారిటీ
– ఒక్కొక్కరుగా హ్యాండ్ ఇస్తారా?
రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పక్షాలకు అసమ్మతి సెగ తప్పడం లేదు. ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రూపంలో బీఆర్ఎస్ ను అసమ్మతి వెంటాడుతుంటే.. ఏపీలో కోటం రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చిలికి చిలికి గాలి వానలా మారి ఆయన్ని అసమ్మతి దారి పట్టేలా చేసింది. దీన్ని ఓ కొలిక్కి తీసుకొని రాక ముందే వైసీపీలో కోటం రెడ్డి బాటలోనే అడుగులు వేస్తున్నారు ఆనం. ఇక నెల్లూరు వైసీపీలో అసమ్మతి సెగ దావానంలా విస్తరిస్తోంది.
ఇన్నాళ్లు అణిగిమణిగి ఉన్న నేతలు ఒక్కొక్కరూ గళం విప్పుతున్నారు. ఆనం, కోటం రెడ్డి బాటలోనే తాజాగా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అసమ్మతి స్వరం వినిపించడం పార్టీకి కొత్త తలనొప్పులు తెస్తోంది. “కార్యకర్తలు అడిగారు.. నెక్ట్స్ ఎన్నికల్లో పోటీ చేయడం ఎట్లా..అని తెలుగు దేశంలో పోటీ చేయాలని ఆలోచన ఉంది…కానీ, నిర్ణయించాల్సి ఉంది అని చెప్పిన..అది భవిష్యత్ లో మాట్లాడుకుందాం.. ముందు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏంటో చూడండి..అని చెప్పా”అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.
వైఎస్సార్ సీపీ కంచుకోట నెల్లూరు జిల్లాలో అసంతృప్తి జ్వాలలు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అధిష్టానం తీరుపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు ధిక్కారస్వరం వినిపించడం.. చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలే..బాహాటంగా పార్టీ తీరును ఎండగడుతున్నారు. “రాజ్యాంగేతర శక్తులు వచ్చి అధికారులను మార్చేశాం..కమిషనర్లను మారుస్తాం..పోలీసుల్ని మారుస్తాం..లేదా ఎమ్మార్వోలను తీసేస్తాం.. ఎంపీడీవోలని తీసేస్తాం.. ఉన్న రాజ్యంగ బద్ధమైన శాసన సభ్యుడికి పోలీస్ ఎస్కార్ట్ ఇవ్వం..ఉన్న సెక్యూరిటీని తగ్గించేస్తాం.. ఇటువంటి ఆలోచన చేసే రాజ్యాంగేతర శక్తులు ఏ రకమైన పరిపాలనా దక్షతను ప్రదర్శించగలరు” అని ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి మండిపడ్డారు.
సొంత పార్టీ నేతలనే నమ్మకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడం..ఆయా నియోజక వర్గాల్లో సమన్వయ కర్తలను నియమించడం, పార్టీ పరిశీలకులను ఏర్పాటు చేయడం పై ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. నియోజక వర్గంలో అభివృద్ధి, ప్రజా సమస్యలపై బహిరంగంగా మాట్లాడితే చాలు.. అధిష్టానం కక్షగడుతోందని వారు ఆరోపిస్తున్నారు.
సీనియర్ నేత ఆనం రాం నారాయణ రెడ్డి నియోజక వర్గంలో ఆయన్ను కాదని పార్టీ సమన్వయకర్తను నియమించగా.. తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గళమెత్తారు. పార్టీ మారనున్నట్లు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి బహిరంగంగానే చెప్పారు. అయితే అధికార పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు పార్టీ వీడే యోచనలో ఉన్నారు.
దీంతో తర్జనభర్జన పడుతున్న అధిష్టానానికి కొత్త తలనొప్పి వచ్చిపడింది. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సైతం అసమ్మతి గళం వినిపించారు. పార్టీ పరిశీలకుడు ధనుంజయ రెడ్డి తనను ఇబ్బంది పెడుతున్నారని.. దీనిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆయన మండిపడ్డారు. మరి ఈ అసమ్మతి ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.