తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ భారత్ జోడో యాత్రకు సర్వం సిద్ధమయ్యింది. జోడో యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ కూడా విడుదల చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఈ నెల 24న తెలంగాణలో రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభమై మొత్తం 13 రోజులు యాత్ర కొనసాగనుందని తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. బోయిన్పల్లిలోని గాంధీ ఐడియాలజి సెంటర్లో భారత్ జోడో యాత్రపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా జైరాం రమేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 7 పార్లమెంట్, 17 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా 360 కిలోమీటర్ల మేర రాహుల్ జోడో యాత్ర ఉంటుందని పేర్కొన్నారు.
రోజుకు 31 కిలోమీటర్లు పాదయాత్ర సాగుతుందన్నారు జైరాం రమేష్. దసరా సందర్భంగా రాహుల్ 2 రోజులు విరామం తీసుకోనున్నట్లు జైరాం రమేష్ తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో ఏఐసీసీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమిటీల ఇంఛార్జ్ కొప్పుల రాజు, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్, భారత్ జోడో యాత్ర జాతీయ కమిటీ సభ్యులు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, భారత్ జోడో కన్వీనర్ బలరాం నాయక్, పార్టీ ఇతర నేతలు పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర హైదరాబాద్ నడిబొడ్డు మీదుగా కొనసాగనుండటంతో నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాదయాత్ర నిర్వహణ ఉండాలని పీసీసీ భావిస్తోంది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు పీసీసీ సీనియర్ నాయకులు పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించింది.
ఈ నెల 24న కర్ణాటక నుంచి మహబూబ్నగర్ జిల్లా మక్తల్ వద్ద రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. అక్కడ నుంచి మహబూబ్నగర్, జడ్చర్ల, షాద్నగర్, శంషాబాద్, ఆరంఘర్, చార్మినార్, ఎంజే మార్కెట్, గాంధీభవన్, నాంపల్లి, విజయనగర్ కాలనీ, మాసబ్ట్యాంక్, నాగార్జున సర్కిల్, పంజాగుట్ట.. అమీర్పేట, కూకట్పల్లి, మియాపూర్, పటాన్చెరు, ముత్తంగి, సంగారెడ్డి ఎక్స్ రోడ్డు, జోగిపేట, శంకరంపేట్, మదనూర్ల మీదుగా మహారాష్ట్రలోకి ప్రవేశిస్తుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. మొత్తం 14 రోజులు.. 375 కిలోమీటర్లు ఈ జోడో యాత్ర కొనసాగనుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు.
తెలంగాణలో కూడా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చరిత్ర సృష్టిస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. రాహుల్పై బీజేపీ ప్రభుత్వం అనేక విధాలుగా బురద జల్లే ప్రయత్నాలు చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. దేశంలో పేదవాడు ఇంకా అట్టడుగు స్థాయికే దిగజారిపోతున్నాడని అన్నారు. నిత్యవసర ధరలు పెరుగుతూనే ఉన్నాయని అన్నారు. ప్రాంతీయ పార్టీలు ఎలాంటి మార్పు తీసుకురాలేవు.. పేరు మారిస్తే అభివృద్ధి జరిగిపోదని సీఎం కేసీఆర్పై ఫైర్ అయ్యారు దిగ్విజయ్ సింగ్.