బయట ఉండే శత్రువుల కంటే.. మనతో ఉండే శత్రువులతోనే ప్రమాదం ఎక్కువని పేర్కొన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. బుధవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఈ సమాజాన్ని కొన్ని కోణాల్లోనే కాకుండా సమగ్రంగా చూడాలని చెప్పారు.
మన హక్కులను కాలరాసే ఎవరినైనా ఎదుర్కోవాల్సిందేనని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించకూడదన్నారు. ఏపీలో ఎస్పీ, ఎస్టీలకు చెందిన 27 పథకాలను తీసేశారని చెబుతుంటే బాదేస్తోందని అన్నారు. ఈ మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన రూ.20 వేల కోట్లను రాకుండా చేశారంటే ఏమనాలి అని ఆయన ప్రశ్నించారు.
వైసీపీ ప్రభుత్వం పబ్లిసిటీ కోసం రూ. 15 వేల కోట్లను ఖర్చు చేసిందని, వైసీపీ రంగుల కోసం రూ.21,500 కోట్లను దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. నిధులను దారి మళ్లించి ఎస్సీ, ఎస్టీలను మోసం చేశారని దుయ్యబట్టారు.
వ్యక్తి ఆరాధన మంచిది కాదని.. ప్రమాదకరమని జనసేనాని అన్నారు. ప్రతీ మనిషి ఏదో ఒక సమయంలో వివక్షకు గురవుతాడని తెలిపారు. వివక్షకు గురైనప్పుడే దాని గురించి తెలుస్తుందని అన్నారు. తాను కూడా వివక్షకు గురయ్యానని చెప్పారు. బ్రిటీష్ ఎయిర్ వేస్ లో ప్రయాణిస్తున్నప్పుడు తనకు నీళ్లు ఇవ్వడానికి ఒక బ్రిటీష్ మహిళ నిరాకరించిందని తెలిపారు పవన్ కళ్యాణ్.