కొణిదెల నాగబాబు.. జనసేన పీఏసీ సభ్యుడు, సినీ నటుడు
కేంద్రం మంజూరుచేసిన 15వ ప్రణాళిక సంఘంలోని నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లోంచి సొమ్మును తీసుకోవడంపై సాంకేతిక లోపం అని చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12, 918 గ్రామ పంచాయతీల్లోని నిధులను ఊడ్చేయడాన్ని ఏమంటారో చెప్పండి. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను మళ్లించుకోవడంపై రాష్ట్ర ప్రజలకు వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
పిల్లల చదువులు, గృహ నిర్మాణాలు, వైద్య ఖర్చులు, భవిష్యత్ అవసరాల కోసం నెలవారీ జీతంలో కొంత సొమ్మును పొదుపు చేసుకుంటున్న ఉద్యోగుల కష్టార్జితం రూ. 800 కోట్ల జీపీఎఫ్ నిధులను మళ్లించింది వైసీపీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన సమయం ఆసన్నమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలపై రూ.8 లక్షల కోట్ల రుణ భారాన్ని ఈ ప్రభుత్వం మోపింది.
సర్పంచుల చేతుల్లో చిల్లిగవ్వ లేకుండా చేసింది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల కష్టార్జితాన్ని కూడా దోచుకోవడం ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణారాహిత్యానికి పరాకాష్ట. ఒక్క రూపాయి ఉత్పాదన గురించి ఆలోచించకుండా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం.. ప్రభుత్వ స్థలాలను విక్రయించడం.. అడ్డూ అదుపూ లేకుండా పన్నులు వసూలు చేయడం.. ప్రభుత్వ ఖజానాలోని ప్రతి పైసాను దారి మళ్లించడం వంటి వాటిని ప్రజలు గమనిస్తున్నారు. ఇదంతా జగన్ రెడ్డి మార్కు పాలన.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంధకారమవుతుంది. ఇక ఏపీకే తలమానికంగా భావిస్తోన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే ఆదాయం అంతా ఎక్కడ పోతోంది. ఆలయానికి వచ్చే భక్తుల నుంచి అద్దె గదుల కోసం వసూలు చేస్తోన్న రిఫండబుల్ డిపాజిట్లను ఏం చేస్తున్నారు. దీనికి టీటీడీ సమాధానం చెప్పాలి. రిఫండబుల్ డిపాజిట్లలో అద్దె జమ చేసుకోగా మిగిలిన సొమ్మును తిరిగి భక్తులకు చెల్లించడం లేదు.
అదేంటి అని అడిగితే బ్యాంకు ఖాతాలకు పంపిస్తామని చెప్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. దేవడిపై భక్తి శ్రద్ధలతో వచ్చే భక్తుల రిఫండబుల్ డిపాజిట్లలో అద్దెకు పోగా మిగతా సొమ్మును ఏం చేస్తున్నారు. చెట్టుపేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు.. దేవుడి పేరుతో భక్తులను దోచుకుంటున్నారు. దీనిపై ప్రజలకు టీటీడీ ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాలి.