2014 మార్చి 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ సభ నుంచి 2022 మార్చి 14న ఇప్పటంలో నిర్వహించిన ఆవిర్భావ సభ వరకూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాలు.. వెల్లడించిన అభిప్రాయాలను పుస్తక రూపంలో రెడీ చేసింది ఆ పార్టీ మీడియా విభాగం. ఏడు వాల్యూమ్స్ లో ఉన్న ఈ పుస్తకాలను గురువారం సాయంత్రం హైదరాబాద్ లో పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కు అందచేశారు.
ఈ పుస్తకాలు తనకు ఎంతో ఆశ్చ్యర్యాన్ని, ఆనందాన్ని కలిగించాయని అన్నారు పవన్ కళ్యాణ్. పార్టీ ఎదుగుదలను తెలియచేసేలా ఏడు సంకలనాలతో కూడిన జనసేన ప్రస్థానం పుస్తకాలు ఉన్నాయని తెలిపారు. ఈ ప్రయాణంలో జనసేన పార్టీ ఎంతగా ప్రజలతో మమేకమైంది.. ప్రజా సేవకు చిత్తశుద్ధితో అంకితమైందో ఇవి తెలియచేస్తున్నాయని అభిప్రాయపడ్డారు పవన్.
పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలను తెలియచెప్పిన అభిప్రాయాలూ, ప్రజా సమస్యలు, రాజకీయ, సామాజిక అంశాలపై చేసిన ప్రసంగాలను అక్షరబద్ధం చేయడం.. పార్టీ శ్రేణులకు ఎంతో ఉపయుక్తంగా ఈ పుస్తకాలు ఉంటాయన్నారు పవన్. ఇవి తనకు ఒక దిక్సూచిలా ఉన్నాయని చెప్పారు. ప్రతి జిల్లాల్లో మాట్లాడినవి.. స్థానిక సమస్యల నుంచి, రాష్ట్ర స్థాయిలో సమస్యల వరకూ ఏ విధంగా స్పందించామో ఈ పుస్తకాలు తెలియచేస్తున్నాయని అన్నారు.
ఈ సందర్భంగా పార్టీ మీడియా విభాగంలోని సభ్యులకు పేరుపేరునా అభినందనలు తెలియచేశారు పవన్. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్, మీడియా విభాగ ప్రతినిధులు చక్రవర్తి, ఎల్.వేణుగోపాల్ పాల్గొన్నారు.