తిరుమల కొండ మీదే నా పెళ్లి.. అందులో సందేహమే లేదు. అమ్మ అనుకున్న ప్రకారమే సరైన వరుణ్ని ఎంపిక చేసుకుని సరైన సమయంలో పెళ్లి చేసుకుంటాను అంటోంది అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ. ఓ మ్యాగజీన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాను తన మనసులోని భావాలన్నీ బయటపెట్టింది.
డెబ్యూ మూవీ ‘ఢడక్’కు ముందు నుంచే పెద్ద ఫాన్ ఫాలోయింగ్ వుంది ఈ అమ్మడికి. తన వీడియోలు, ఫోటోలు ఎప్పుడూ వైరల్ అవుతూనే వుంటాయి. అది తన క్రేజ్ను మరింత పెంచేది కావడంతో ఎప్పుడూ వాటికి దూరంగా వుండాలని అనుకోలేదంటోంది. ‘నేను నాలాగే వుంటాను. సహజంగా వుండాలన్నదే నా స్వభావం. ఫ్యాషన్స్ కోసం పెద్దగా వెంపర్లాడను. నేను సంప్రదాయాల్ని చాలా బాగా గౌరవిస్తాను. అలా ఉండటమే అమ్మకు ఇష్టం’ అంటోంది జాన్వీ కపూర్.
‘పెరుగన్నం, ఇడ్లీ సాంబార్, ఖీర్.. అంటే ఎంతో మక్కువ. నా వివాహం కచ్చితంగా తిరుపతిలోనే జరుగుతుంది. అది నాకు తెలుసు. కంచి పట్టు చీర కట్టుకుని ముస్తాబవుతాను. నన్ను అమ్మ అంత తొందరగా నమ్మదు. ఎందుకంటే నేను చాలా తేలిగ్గా ప్రేమలో పడిపోతా. మగవాళ్ల విషయంలో నా జడ్జిమెంట్ మీద అమ్మకు నమ్మకం వుండేది కాదు. నాకు కావాల్సిన వాడిని తనే సెలెక్ట్ చేయాలని అనుకుంది’ అంటూ అమ్మని గుర్తుచేసుకుంది. ఇటీవల సింగపూర్ టుస్సాడ్ మ్యూజియంలో అమ్మ బొమ్మకు ఎదురుగా నిలుచుని తదేకంగా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న జాన్వీని ప్రపంచమంతా చూసి సానుభూతి తెలిపింది.