సునామీ… ఎంతో మంది జీవితాల్లో చీకట్లు నింపింది. సరిగా 11 ఏళ్ల క్రితం జపాన్ లో వచ్చిన సునామీని ఇప్పటికీ అక్కడ ఎవరూ మర్చిపోవడం లేదు. ఈ సునామి రగిల్చిన ఆవేదన, మిగిల్చిన విషాదాల తాలూకు స్మృతులను నెమరేసుకుంటూ ఎందరో జీవచ్చవాలుగా బతుకులీడుస్తున్నారు. అయితే, ఓ వ్యక్తి మాత్రం తన భార్య మృతదేహాన్ని దొరకబుచ్చుకునేందుకు గత 10 ఏళ్లుగా సముద్రంలో డైవింగ్ చేస్తున్నాడు. ఏనాటికైనా ఆమె మృతదేహం దొరక్కపోతుందా అనే చిన్న ఆశ.. ఆయనను వారం వారం సముద్రంలో వెతికేలా చేస్తున్నది.
2011 మార్చి 11 వ తేదీన జపాన్ సముద్ర గర్భంలో భూకంపం కారణంగా సునామి సంభవించి ఎందరో చనిపోయారు. మరెందరో గల్లంతయ్యారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటివరకు చనిపోయిన వారు 20 వేల మంది చనిపోగా.. ఎందరో గల్లంతయ్యారు. దాదాపు 4.50 లక్షల మంది ఇళ్లు కోల్పోయారు.
ఈ ఘటన ఉత్తర జపాన్కు చెందిన యసువో తకమత్సు జీవితంలో కూడా కల్లోలం రేపింది. సునామీలో తకమత్సు భార్య గల్లంతైంది. సముద్రంలో భార్య మృతదేహాన్ని దొరకపట్టుకోవడానికి ఈ పెద్ద మనిషి స్కూబా డైవింగ్ నేర్చుకుని ప్రభుత్వం నుంచి లైసెన్స్ కూడా పొందాడు.
ప్రతి వారం సముద్రంలో డైవింగ్ చేస్తూ 2013 నుంచి భార్య మృతదేహం కోసం పట్టువదలని విక్రమార్కుడిలా వెతుకుతున్నాడు. తన భార్య అంటే తనకు ఎంతో ప్రేమ అని, ఆమె మృతదేహం దొరికేంత వరకు వెదుకుతూనే ఉంటా అని చెప్తున్నాడు యసువో తకమత్సు. సునామీ సంభవించిన తొలినాళ్లలో సముద్రం ఒడ్డున పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తరలించడంలో పనిచేసిన తకమత్సుకు.. భార్య వాడిన ఫోన్ దొరికింది. దాంతో ఆనాటి నుంచి భార్య జాడ కోసం శ్రమించడం మొదలెట్టాడు.
భూమిపై ఆనవాళ్లు దొరక్కపోవడంతో.. 2013 నుంచి సముద్రంలో డైవింగ్ చేస్తూ ఆశగా సెర్చ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన వయసు 65. ‘నువ్వు బాగున్నావా.. నేను ఇంటికి పోవాలనుకుంటున్నా..’ అని చివరిసారిగా తనకు మెసేజ్పెట్టిందని తకమత్సు గుర్తు చేసుకున్నాడు. చెత్తలో దొరికిన ఫోన్లో సెండ్కాని మెసేజ్ ‘సునామీ వినాశకరంగా ఉన్నది’ అని రాసి ఉన్నది. ఇలాఉండగా, సునామి కారణంగా ఇప్పటికీ దాదాపు 2,500 మంది కనిపించడం లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తున్నది.