పారిశ్రామికవేత్త, చిగురుపాటి జయరామ్ హత్య కేసులో తీర్పును నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. 4 సంవత్సరాల విచారణ అనంతరం.. సోమవారం ఈ కేసుపై తీర్పు వెలువరించాల్సి ఉంది. అయితే.. ఇంకా సిద్ధం కాని కారణంగా.. తీర్పును మార్చి 6న వెలువరిస్తామని వెల్లడించింది న్యాయస్థానం. 12 మంది నిందితులు కోర్టుకు హాజరయ్యారు.
ఈ కేసులో మొత్తం 388 పేజీల చార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు. మొత్తం 12 మందిని నిందితులుగా చేర్చారు. 300 మందికి పైగా వ్యక్తులను విచారించినట్లు తెలిపారు. 80 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డికి సహకరించిన పోలీసులపైనా డిపార్ట్ మెంట్ పరంగా చర్యలు తీసుకోనున్నారు.
2019 జనవరి 30న చిగురుపాటి జయరాంను జూబ్లీ హిల్స్ లోని ఆయన ఇంటినుంచి రాకేష్ రెడ్డి తన నివాసానికి రప్పించాడు. అక్కడ వారిద్దరి మధ్య ఆర్ధిక లావాదేవీల గురించి గొడవ జరిగింది. అనంతరం జయరాంను నిర్భందించి రాకేష్ రెడ్డి హత్యచేశాడు. తర్వాత శవాన్ని హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి నందిగామ సమీపంలో పడేశాడు.
ఈకేసులో రాకేష్ రెడ్డి మొదటి నిందితుడిగా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. చంచల్ గూడ జైలులో ఉండి కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ కేసులో పోలీసుల ప్రమేయం కూడా ఉండడంతో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.