టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) షాక్ ఇచ్చింది. ఆయన కంపెనీలకు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లలో అవతవకలు జరిగినట్టు ఈడీ వెల్లడించింది.
జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడైన కాంట్రాక్టర్ గోపాల్రెడ్డికి కంపెనీకి సంబంధించిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. దివాకర్ రోడ్లైన్స్, ఝటధార ఇండస్ట్రీస్, సీ.గోపాల్ రెడ్డి అండ్కోకు సంబంధించిన కంపెనీ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. రూ.22.10కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ పేర్కొంది.
బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లు సుప్రీం కోర్టు ఉత్తర్వులకు విరుద్దంగా జరిగాయని ఈడీ పేర్కొంది. బీఎస్-4 వాహనాలను జటధార ఇండస్ట్రీస్ కొనుగోలు చేసిందని వివరించింది. బీఎస్-4 వాహనాలను గోపాల్రెడ్డి అండ్ కో కూడా కొనుగోలు చేసిందని ఈడీ చెప్పింది.
అశోక్ లీల్యాండ్ నుంచి తక్కువ ధరకు వాహనాల కొనుగోలు జరుగుతన్నట్లు ఈడీ వివరాలు బయటపెట్టింది. ఏపీ, కర్ణాటక, నాగాలాండ్లో నకిలీ ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు అవుతున్నట్లు ఈడీ స్పష్టం చేసింది. రూ.38.36 కోట్ల అక్రమ క్రయ, విక్రయ లావాదేవీలు గుర్తించిట్టు ఈడీ అధికారులు తెలిపారు. అశోక్ లీల్యాండ్ పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.