సిరిసిల్ల పట్టణంలో కొనసాగుతున్న నేత కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఆసాములకు 10శాతం రావాల్సిన యారాన్ సబ్సిడీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కార్మికులకు కూలీ ఒప్పందం ప్రకారం పెంచిన కూలీ రేట్లు అందించాలన్నారు. ప్రతి నేత కార్మికునికి నెలకు 23 వేల జీతం అందించాలన్నారు జీవన్ రెడ్డి. నేత కార్మికులు సుఖశాంతులతో వర్ధిల్లుతారని తెలంగాణ ప్రాంతం మొత్తం అనుకుంటోందని వ్యాఖ్యానించారు.
కానీ.. చేనేత కార్మికులకు, ఆసాములకు కూలీ గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి.. ఒప్పందం ప్రకారం పెంచిన కూలీ విధానాన్ని అమలు చేయాలని కోరారు. నేత కార్మికులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో రోడ్డెక్కారని అన్నారు.
కార్మికుల పట్ల ప్రభుత్వం కనికరం చూపాలని కోరారు. ఐదు సంవత్సరాల క్రితం కూలీ ఏదైతే ఉందో.. ఇవాళ కూడా అదే ఉందని అన్నారు. నేత కార్మికుల సమ్మేపై వెంటనే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి.